ముషీరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని సమాచార హక్కు కమిషనర్ బుద్దా మురళి అన్నారు. గురువారం ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి సభ చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని బుద్దా మురళి కాళోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ మాతృభాషా స్పూర్తిగా, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. ఎవరి భాషను వారే రాయాలే, మాట్లాడాలే అనే కాళోజీ మాతృభాషా స్పూర్తి అద్భుతమన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త రమణ వెలమకన్ని, గాయకురాలు ఆమని, టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.