రాత్రి ఎముకలు కొరికే చలి.. పగలంతా వణుకుడు.. ఎడతెరిపి లేని చలి కారణంగా జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతున్నది. బుధవారం సూర్యాపేట జిల్లాలో 11 డిగ్రీలు, నల్లగొండ 13.4, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గృహిణులు, విద్యార్థులు, పాల వ్యాపారులు.. అన్ని వర్గాల ప్రజలు వణికిపోతున్నారు. పట్టణాల్లోనూ దుకాణా సముదాయాలు రాత్రి 8గంటలకే మూతపడడం పరిస్థితికి
అద్దం పడుతున్నది.
ఉదయం పది గంటలైనా చలి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇంటిల్లిపాది దుప్పట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇండ్ల పైట్యాంకుల్లో నీళ్లు ఐస్ను తలపిస్తున్నాయి. పగటిపూట సూర్యుడు మండుతున్నా ప్రజలు నీడకు రావడం లేదు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలిగాలులు, సాయంత్రం ఆరు గంటల నుంచే మంచు కురుస్తున్నది. దాంతో ఊహించని రీతిలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది.
ఉదయం 9గంటలకు కూడా చలి తగ్గకపోవడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విధుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న ఉద్యోగులు, మార్నింగ్ వాకింగ్ చేసేవారు, రైతులు, కూలీలు, కార్మికులు, వ్యాపారులు గరం కోట్లు ధరించకుండా బయటికి రావడం లేదు. పాలు, కూరగాయల వ్యాపారులు, పేపర్ బాయ్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో చలి నేస్తాలుగా పేరున్న ఉన్ని వస్ర్తాలకు గిరాకీ పెరిగింది. వ్యాపారులు ఉన్ని దుస్తుల (స్వెట్టర్స్, రగ్గులు, మఫ్లర్స్) విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయటంతో కొనుగోళ్లు పెరిగాయి.
సంక్రాంతి వరకూ ఇదే పరిస్థితి..
చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ప్రధానంగా శ్వాసకోస సంబంధిత వ్యాధిగ్రస్తులకు కంటి మీద కునుకు ఉండదు. ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో రెండేళ్లలోపు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, గొంతునొప్పి, సైనసైటిస్, న్యుమోనియా, ఆస్తమా తదితర శ్వాసకోస వ్యాధులతో పాటు రక్త నాళాలు కుచించికుపోయి గుండెపోటుకు కూడా దారి తీసే ప్రమాదం ఉన్నది. సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉపశమనం పొందండిలా..
ప్రయాణికులు, ఇంటి నుంచి పనుల కోసం బయటకు వెళ్లే వారు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఐదేండ్లలోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారు, శ్వాసకోస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం వేళలో వాకింగ్ చేయకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే శరీరమంతా కప్పేలా ఉన్ని వస్ర్తాలు ధరించాలి. చెవి, ముక్కు, నోటి నుంచి గాలి లోపలికి వెళ్లకుండా మఫ్లర్ వాడాలి. ఇంట్లో ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. ఎప్పుడు స్నానం చేసినా గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి. చర్మం పొడిబారకుండా తేమను పెంచే క్రీములు వాడాలి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు బయటికి వెళ్లకూడదు. తీవ్రమైన చలితో చేతులు పట్టు తప్పుతాయి. అందువల్ల అత్యవసరమైతే తప్ప రాత్రిళ్లు, తెల్లవారు జామున వాహనాలు నడుపకపోవడమే మంచిది. ఆస్తమా రోగులు తప్పనిసరిగా ఇన్హేలర్లను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
వారం రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ప్రధానంగా వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రత 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. సాయంత్రం 4గంటల నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. పట్టణాలు, మున్సిపాలిటీల్లో వ్యాపార దుకాణాలు సైతం రాత్రి 8గంటలకే మూతపడుతున్నాయి.