వెంగళరావునగర్ : అక్రమంగా భారత్లో నివాసం ఉంటూ.. ఆధార్, ఓటర్ కార్డులను పొందాడు ఓ శ్రీలంక జాతీయుడు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో రెండు సార్లు పాస్పోర్టుకు దరఖాస్తు చేయగా.. అధికారులు రిజక్ట్ చేశారు. మళ్లీ ఇప్పుడు మూడోసారి తెలంగాణ రాష్ట్రం నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన శ్రీలంక జాతీయుడిపై ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం శ్రీలంక దేశానికి శివనేశ్వరన్ మణికందన్ (32) అనే వ్యక్తి ఎస్ఆర్ నగ ర్ బీకేగూడ పార్క్ సమీపంలోని యోషితా రెసిడెన్సీలో గతకొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. భారతీయుడిగా నమ్మిం చి తప్పుడు ధ్రువపత్రాలతో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు పొందాడు. వీటి ఆధారంగా పాస్పోర్టు కోసం దరఖాస్తు చేశాడు.
గత ఆగస్టులో పాస్పోర్ట్ దరఖాస్తు పరిశీలన కోసం వెస్ట్ జోన్ హెడ్ కానిస్టేబుల్ షేక్ నజీర్ బాష ఆ చిరునామాకు వెళ్లారు. పాస్పోర్ట్ దరఖాస్తు చేసిన శివనేశ్వరన్ మణికందన్తో పాటు.. అతని ఇంటి యజమాని దంపతులైన కళ్యాణ్, శిరీషలను కూడా ఆరాతీశారు. శివనేశ్వరన్ ఏడాదిన్నర కాలంగా తమ క్లీనర్ గా పనిచేసుకుంటూ తమ వద్దే అద్దెకు ఉంటున్నట్టు ధ్రువపరుస్తూ..వారు పోలీసులకు తెలిపారు.
శివనేశ్వరన్పై ఏమైనా గతంలో కేసులు ఉన్నాయోమనే అనుమానంతో సీసీటీఎన్ఎస్ లో పరిశీలించారు. అతనిపై అప్పటివరకు పోలీసు కేసులు లేనట్టు తేలడంతో.. అన్ని సక్రమంగా ఉన్నాయని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి హెడ్ కానిస్టేబుల్ నజీర్ బాష నివేదిక పంపించారు. ఆ తర్వాత తమిళనాడు లోని తిరుచునాపల్లి రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం నుంచి ఇక్కడి పాస్పోర్ట్ కార్యాలయానికి.. స్థానిక పోలీసులకు లేఖ అందింది.
శివనేశ్వరన్ శ్రీలంక జాతీయుడని 2017, 2019 సంవత్సరాల్లో రెండుసార్లు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేశాడని.. రెండుసార్లు కూడా నిరాకరించడం జరిగిందని.. నోటీసులు ఇచ్చినా అతను స్పందించలేదనే విషయాన్ని ఇక్కడి అధికారులు తెలియపర్చారు.
గతంలో పాస్ పోర్టు కోసం చేసిన దరఖాస్తుల విషయాన్ని దాచిపెట్టాడని.. శ్రీలంక జాతీయుడైన అతను భారత్ లో అక్రమంగా నివాసం ఉంటూ తప్పుడు పత్రాలు సృష్టించాడని.. దేశాన్ని, చట్టాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించాడని హెడ్ కానిస్టేబుల్ నజీర్ బాష ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు శ్రీలంక జాతీయుడైన శివనేశ్వరన్తో పాటు ఇతనికి సహకరించిన ఇంటి యజమాని దంపతులైన కళ్యాణ్, శిరీషల పై ఐపిసి 420, 468, 471, సెక్షన్ 14 ఏ (బి) ఫారినర్స్ యాక్ట్ 1946 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.