మెదక్ రూరల్, జనవరి 9 : ఆర్టీసీ కార్గోసేవలు అంగన్వాడీ కేంద్రాల వరకు విస్తరించాయి. గతంలో ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టర్ ద్వారా బాలామృతం, నూనె, మురుకులు, పప్పు సరాఫరా అయ్యేవి. అయితే ఈ విధానంతో జాప్యంతో పాటు అక్రమాలు జరుగుతుండడంతో వాటి నివారణకు ప్రభుత్వం కార్గో సేవలను వినియోగించుకునేందుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని ఎఫ్సీఐ గోదాం నుంచి నేరుగా సరుకులు ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలకు చేర్చడంతో ఆర్టీసీకి ఆదాయం పెరుగుతున్నది. ప్రతి నెలా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు నిర్ణీత సమయంలో కార్గో బస్సుల ద్వారా సరుకులు చేరుతుండటంతో అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమో దు చేసి అందజేస్తున్నారు. దీని ద్వారా సరుకులు పక్కదారి పట్టకుండా సకాలంలో అందుతున్నాయని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు.
సకాలంలో అందుతున్నాయి..
ఆర్టీసీ కార్గో ద్వారా ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కేంద్రాలకు రావడంతో సకాలంలో అందుతున్నాయి. దీంతో మేం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులను పంపిణీ చేస్తున్నాం.
-రాజలక్ష్మీ, మంబోజిపల్లి, అంగన్వాడీ టీచర్
ప్రతి నెలా కార్గో ద్వారా సరుకులు
ఆర్టీసీ కార్గో సేవలు బాగున్నాయి. కేంద్రాలకు సరుకులు సరైన సమయంలో వస్తున్నాయి. బయోమెట్రిక్ విధానంలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో వేలి ముద్రలు తీసుకొని కేటాయించిన సరుకులను వారికి ఆర్టీసీ సిబ్బంది అందిస్తున్నారు. సరుకులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ఉంటాయి. అవినీతి అక్రమాలకు ఈ విధానంలో చెక్ పడింది.
-జయరాం నాయక్ , జిల్లా మహిళాశిశు సంక్షేమ అధికారి