అడ్డగూడూరు, డిసెంబర్ 19 : మండలంలోని వెల్దేవి గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన ఇంటి పన్ను వసూళ్ల కోసం సర్పంచ్ పిల్లి శ్రీకళాసుందర్ వినూత్న ఆలోచన చేశారు. పన్ను చెల్లించిన వారికి తన సొంత ఖర్చుతో లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందిస్తామని ఆఫర్ పెట్టారు. రూ.10వేల విలువైన వస్తువులను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మొదటి బహుమతి రూ.5వేల విలువైన కూలర్, రెండో బహుమతి రూ.3వేల విలువైన స్టాండ్ ఫ్యాన్, మూడో బహుమతి రూ.2వేల విలువైన రైస్ కుక్కర్ ఇవ్వనున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ బహుమతులను తన సొంత డబ్బుతో ఇవ్వనున్నట్లు సర్పంచ్ చెప్పారు. ఇంటి పన్ను కట్టండి.. గ్రామాభివృద్ధికి తోడ్పడండి అని గ్రామస్తులను కోరారు.
జనవరి 26న లక్కీ డ్రా..
2021 ఏప్రిల్ 1 నుంచి 2022 జనవరి 25 వరకు అన్ని రకాల పన్నులను బకాయి లేకుండా చెల్లించిన వారు మాత్రమే లక్కీ డ్రాకు అర్హులు. జనవరి 26న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు గ్రామంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. గ్రామంలో 938 మంది జనాభా ఉండగా.. 302 ఇండ్లు ఉన్నాయి. ఇంటి పన్ను బకాయి రూ.1.10 లక్షలు ఉండగా ఇప్పటి వరకు రూ.7వేలు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.1.03 లక్షలు పెండింగ్లో ఉన్నాయి.
గ్రామాభివృద్ధికి సహకరించాలి
గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో పన్నులు వసూలు చేయాలని నిర్ణయించాం. పూర్తిగా చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా రూ.10వేల విలువైన బహుమతులు ప్రకటించాం. దీంతో గ్రామస్తుల్లో చైతన్యం పెరిగి పన్ను కట్టడానికి పోటీ పడుతున్నారు.