
చేర్యాల, జనవరి 9 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. 25వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్నారు. ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.కొందరు భక్తులు స్వామి వారి నిత్యకల్యాణోత్సవం మొక్కు లు చెల్లించుకున్నారు. కొండ పైన ఎల్లమ్మను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో చైర్మన్ గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.