చార్మినార్ : భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో దీపావళి వేడుకల సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ చేసినట్లు ఆలయ ట్రస్టీ శశికళ తెలిపారు. బుధవారం తెల్లవారు జాము నుండి శుక్రవారం రాత్రి వరకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు.
గురువారం రాత్రి 7 గంటలకు మహా హారతి అనంతరం అమ్మవారి భక్తులకు ఖజానాను పంపిణీ చేయనున్నామని శశికళ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున రానున్న దృష్ట్యా అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు.
భారీ బందోబస్తు..
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో దీపావళి వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించనున్న నేపధ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమ్మవారి దర్శనానికి భక్తల తాకిడి సైతం భారీ స్థాయిలో కొనసాగనున్న నేపథ్యంలో ప్రముఖుల భద్రతకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఏర్పాట్లను చేశామని ఇన్స్పెక్టర్ గురు నాయుడు తెలిపారు.