చార్మినార్ : దీపావళి వేడుకలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయ ట్రస్టీ శశికళ తెలిపారు. సోమవారం ఆమె దేవాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ దీపావళి ఉత్సవాల్లో భాగంగా ప్రతి యేటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం సైతం మూడు రోజుల పాటు భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం లో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
మంగళవారం తెల్లవారు జాము నుండి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. మంగళవారం తెల్లవారు జామున లక్ష్మీ అమ్మవారికి అభిషేకం , అలంకరణలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పిస్తామని తెలిపారు. దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహిస్తా మని తెలిపారు.
ఆ రోజున రాష్ట్ర గవర్నర్ తమిళ సైతోపాటు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్రావు, పలవురు మంత్రులు, ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, మాజీ డీసీపీ హెచ్.జే దొరతోపాటు పలువురు అమ్మవారి దర్శనార్థం విచ్చేస్తున్నారని తెలిపారు. గురువారం సాయంత్రం అమ్మవారికి 7 గంటల ప్రాంతంలో మహా హారతి అనంతరం భక్తులకు అమ్మవారి ఖజానాను ప్రసాదంగా అందిస్తామని తెలిపారు.
భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించడానికి నగరంతోపాటు పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తులకు సులభ దర్శనం కోసం చార్మినార్ వద్ద ప్రత్యేక భారీకేడ్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కోవిద్ నిబంధనలు పాటిస్తూనే అమ్మవారి దర్శనం కల్పించనున్నామని ట్రస్టీ శశికళ తెలిపారు.
భాగ్యలక్ష్మీ ఆలయంలో అమ్మవారి దర్శనాలు ప్రశాంతంగా నిర్వహించడానికి చార్మినార్ పోలీసులతోపాటు దేవాలయానికి చెందిన 150 మంది వాలంటీర్లు 24 గంటల పాటు సేవలు అందించనున్నారని తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్
సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్రాత్రేయ దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రాదాయాలకు అనుగుణంగా ఆలయ ట్రస్టీ గవర్నర్ దత్తాత్రేయకు సాదర స్వాగతం పలికారు. అర్చక స్వాములు ప్రత్యేక పూజాధి కార్యక్రమాలను నిర్వహించి హారతి అందించారు. అనంతరం ఆలయ ట్రస్టీ శశికళ బండారు దత్తాత్రేయకు ఆలయ జ్ఞాపికలను అందించారు.