ఖైరతాబాద్ : లిఫ్ట్ ప్లీజ్….బావా..నాకు అర్జంటుగా పని ఉంది….ఫలాన చోటకు వెళ్లాలి….అంటూ బైకు ఎక్కుతుంది… ప్రయాణంలోనే పని ముగించుకొని దిగిపోతుంది. ఓ హిజ్రా గత కొంత కాలంగా పలువురిని బైక్పై లిఫ్టు అడుగుతూ గొలుసులు కొట్టేస్తుంది. తాజాగా పంజాగుట్టలో ఏకంగా ఓ ఏఆర్ కానిస్టేబుల్ బంగారు చైన్ను అపహరించింది.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మెహిదీపట్నంకు చెందిన ఈశ్వర్ ప్రసాద్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఓ జడ్జి వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు. గత శుక్రవారం అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో బేగంపేట డీకే రోడ్డులో అంజు అనే హిజ్రా తారసపడింది.
తనకు అర్జంటుగా పని ఉందని, పంజాగుట్ట వెళ్లాలని చెప్పింది. దీంతో ఈశ్వర్ప్రసాద్ తన బైకుపై ఎక్కించుకొని అమీర్పేట మీదుగా పంజాగుట్ట వద్ద దించి వెళ్లాడు. ఇంటికి వెళ్లి చూసుకోగా, మెడలో బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి ఘటనలోనే మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సదరు హిజ్రాపై కేసు ఉండటంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మంగళవారం అంజును మహాంకాళి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ విషయం వెలుగులోకి వచ్చింది.