హన్వాడ, జనవరి 8 : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు రైతన్నల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ వారికి కొండంత అండగా నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం గండీడ్ మండలం చౌదర్పల్లి గ్రామంలో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డితోపాటు మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండ్లబండిపై రైతులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే ర్యాలీగా వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రైతుబంధు వంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో యాసంగి పెట్టుబడి సాయం రూ.7,500 కోట్లు జమైందన్నారు. నాలుగేండ్లలో రూ.50.600 కోట్లు రైతుబంధు ఇచ్చామని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలోనే రూ.14 వందల కోట్లు అందించామని తెలిపారు. కర్షకులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయనన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో రైతులకు ఎంతో ధైర్యంగా ఉందన్నారు. అన్నదాత అప్పుల పాలు కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధును ప్రారంభించారని వివరించారు. ప్రస్తుతం ఖాతాల్లో వేసిన పెట్టుబడి డబ్బులను బ్యాంకర్లు పాతబాకీ కింద పట్టుకోవద్దని మంత్రి సూచించారు. ఒకవేళ ఎవరైనా పాత బాకీ కింద జమ చేస్తే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వ్యవసాయం పండుగల మార్చి రైతును రాజు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రైతుబంధు సాయం అందించామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఇప్పుటికే పూర్తయ్యేవని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు కోర్టుల్లో కేసులు వేయడంతో పనులు పూర్తి కాలేదన్నారు. 60 ఏండ్లు పాలించిన హస్తం పార్టీ రాష్ర్టానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తెలంగాణ రైతులపై కేంద్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. పంజాబ్లో ఏడాది పాటు రైతులు ఆందోళనలు చేసినా మోడీ సర్కారు వారిని పట్టించుకోలేదని గుర్తు చేశారు. రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, ఏడీ సుచరిత, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఎంపీపీ మాధవి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గిరిధర్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు భిక్షపతి, విండో వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, కుల్కచర్ల జెడ్పీటీసీ రాందాస్నాయక్, ఏవోలు ప్రత్యూష, కృపాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.