ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ.సాగర్, కార్యదర్శి పశ్య పద్మ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేవీ.చలపతిరావు మాట్లాడారు. రైతు ఉద్యమానికి తలవంచిన కేంద్రం వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఉద్యమాన్ని విరమింప చేసి వాగ్ధానాలు విస్మరించిందన్నారు.
రైతులను ఆదుకోవడానికి మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, రైతు ఉద్యమ అమరుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లఖింపూర్ హత్యాకాండకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించడంతోపాటు హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక నాయకుడు విస్సా కిరణ్, ఇతర సంఘాల నేతలు జక్కుల వెంకటయ్య, పాలడుగు భాస్కర్, వెంకటేశ్, సూర్యం, కాంతయ్య, శోభన్, బురి ప్రసాద్, వెంకట్రాములు, పద్మ, అబ్బాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.