భువనగిరి అర్బన్, జనవరి 6 : పాఠశాలల్లో కొవిడ్ వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించి అర్హులైన విద్యార్థులకు టీకా వేయించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు సూచించారు. 15 నుంచి 18 సంవత్సరాలలోపు వారికి వ్యాక్సినేషన్లో భాగంగా గురువారం పట్టణంలోని విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ క్యాంపును ఆమె పరిశీలించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు టీకా తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో సైతం టీనేజర్లకు టీకాలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.
బీబీనగర్ : మండలంలోని బట్టుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి అర్హులైన విద్యార్థులకు టీకాలు వేశారు. కార్యక్రమాన్ని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్ పరిశీలించారు. 15 నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జి. మాధవీపురుషోత్తంరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్రెడ్డి, ఏఎన్ఎం సరస్వతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
5,247 మందికి టీకా
భువనగిరి అర్బన్, జనవరి 6 : జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతున్నది. గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు జిల్లాలోని 21 పీహెచ్సీలు, 3 సీహెచ్సీల్లో టీకాలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 5,247 మందికి టీకా వేసినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు.