ఖైరతాబాద్ : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సంక్షేమానికి పాటు పడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసినవన్ని నిజం కాదు.. సత్యం తెలుసుకుంటే మంచింది..ఆ రాతల్లో ఏమాత్రం వాస్తవాలు లేవు’ అని తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సమాఖ్య చైర్మన్ పరెడ్డి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సోమాజి గూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘సైనిక సంక్షేమం ఉత్తుత్తి మాటేనా’ అంటూ ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వచ్చిన కథనాన్ని తప్పుపట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 సెప్టెంబర్ 3న సిక్స్మెన్ కమిటీ వేశారని, అందులో చైర్మన్ డీజీపీగా, వైస్ చైర్మన్ హోం శాఖ కార్యదర్శి, ఇంకా సభ్యులు ఉంటారని తెలిపారు. అంత వరకు నామమాత్రంగా కమిటీ సమావేశాలు జరిగాయని రాశారని, వాస్తవానికి 2016 జనవరి, నవంబర్లలో, 2018 జూన్, 2019 డిసెంబర్ లో సమావేశాలు జరిగాయని, 2020-21లో కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించలేదన్నారు.
నిధుల విషయానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో తన వంతుగా ఒక లక్ష రూపాయలు, మంత్రులు రూ.20వేలు, ఎమ్మెల్యేలు రూ.10వేలు, ప్రభుత్వం ఉద్యోగులు ఒక రోజు బేసిక్ జీతాలు ఇస్తున్నట్లు ప్రకటించడంతో పాటు 2018 నుంచి అది సైనిక సంక్షేమానికి అందుతున్నాయన్నారు. అలాగే సైనిక సంక్షేమ నిధిలో రూ.23 కోట్లు ఉన్నాయని, వాటిని దేనికి కూడా వినియోగించలేదని, సైనికుల సంక్షేమానికి అలానే ఉంచారని అన్నారు.
ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే జీఓ ప్రకారం ఒక్క శాతం ఇవ్వాల్సి ఉంటుందని, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ లాంటి కోర్సులకు 2 శాతం ఇస్తున్నారని, ఆ జీఓలు ప్రకారమే సీట్లు కూడా కేటాయిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. ఎక్స్ సర్వీస్మెన్కు జాబ్ ఇవ్వడం లేదని అంటున్నారని, అది అమలవుతున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా వీఆర్ఏ, వీఆర్ఓ, జెన్కో, టీపీపీఎస్సీలో కూడా అమలవుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు.
1956లో ఒక్కటే సైనిక్ ఆరంఘర్ కట్టారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని, ప్రస్తుతం నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్లో సంక్షేమ భవనాలు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభమవుతాయని, ఖమ్మంలో నిర్మాణ దశలో ఉందన్నారు. పూణే నేషనల్ డిపెన్స్ అకాడమీలో చేరే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం అందిస్తున్నదని, 66 మందికి రూ. 2లక్షల చొప్పున సాయం అందిన విషయం వారికి తెలుసా అని ప్రశ్నించారు.
భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సాయం చేయలేదన్నది స్పష్టమన్నారు. దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడ 2వేల మంది ఎక్స్సర్వీస్ మెన్లకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా నియమించారని, అప్పుడు వారి వేతనం రూ.7,500 ఉండేదని, 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.10వేలకు పెంచారని, రెండు సంవత్సరాల తర్వాత రూ. 20వేలు, రెండు నెలల క్రితం రూ.26వేలు పెంచారని ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఫాల్స్ అలిగేషన్స్ చేశారన్నారు.
సమాఖ్య గౌరవ చైర్మన్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంత రావు మాట్లాడుతూ అమరులైన సైనికుల కుటుంబాల్లో వితంతు వులకు పింఛన్లు ఇస్తున్నారని, వారితో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని మరణించిన వారి కుటుంబాల్లోని వితం తువులకు సైతం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబర్ 7న ఫ్లాగ్ డే ఫండ్ సేకరిస్తారని, ఇప్పటివరకు రూ.30కోట్లు నిధులు సమకూరాయన్నారు. సైనికుల భూములు, ఇతర వివరాలన్నింటినీ డిజిటలైజ్ చేశారని, లైఫ్ సర్టిఫికేట్ సైతం డైరెక్టర్ కార్యాలయంలో ఆన్లైన్ విధానంలోకి తీసుకువచ్చారన్నారు.
చైనాతో జరిగిన పోరులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రూ.5కోట్ల చెక్కును ఆయన కుటుంబానికి అందచేశారని, 700 గజాల స్థలం, ఆయన సతీమణి సంతోషి డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సైనికుల సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవని, సహృదయం కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన మేలు మరిచిపోమని అన్నారు. ఈ సమావేశంలో సమాఖ్య సెక్రటరీ జనరల్ కె. మధు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.