ఖమ్మం సిటీ, జనవరి 8: ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ (ఐబీబీఎఫ్) నిర్వహించిన బాడీ బిల్డింగ్ జాతీయ స్థాయి పోటీలు అబ్బురపరిచాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఐబీబీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాంపియన్షిప్లో విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించడం నగరానికే గర్వకారణమన్నారు. వందలాది మంది అథ్లెట్స్కు నగరం వేదికగా మారడం సంతోషకరమన్నారు. తొలుత ఖమ్మం జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఐబీబీఎఫ్ సెక్రెటరీ జనరల్ చైతన్య పటారే, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత ప్రేమచంద్ డేగ్రా, అర్జున అవార్డు గ్రహీతలు టీవీ ఫౌలీ, భాస్కరన్, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు స్వామిరమేశ్, ఖమ్మం జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్, నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్ పాల్గొన్నారు.
దేశ నలమూలల నుంచి 532 మంది..
పోటీలకు దేశ నలుమూలల నుంచి 532 మంది బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొన్నారు. ఎత్తు, బరువు, వ్యక్తిగత విభాగాలు కలిపి మొత్తం 10 కేటగిరీల్లో పోటీలు జరిగాయి. 165 సెంటిమీటర్ల ఎత్తు విభాగంలో ఐదుగురు, ఓపెన్ కేటగిరీలో ఐదుగురు, 165 సెంటిమీటర్లకు మించి ఎత్తు విభాగంలో ఐదుగురు, ఓపెన్ కేటగిరీలో మరో ఐదుగురు పతకాలు సాధించారు. బరువు కేటగిరీలో 55, 60, 65, 70, 75, 80, 85, 90, 100 కిలోలతో పాటు వంద కిలోలు పైబడిన పోటీల్లో 50 మంది విజేతలుగా నిలిచారు.
ఓవరాల్ చాంపియన్ సాగర్ కతుర్థే..
ఓవరాల్ చాంపియన్షిప్ను మహారాష్ట్రకు చెందిన సాగర్ కతుర్థే అనే బాడీ బిల్డర్ కైవసం చేసుకున్నాడు. ఈయన సెంట్రల్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ బోర్డ్లో పనిచేస్తున్నాడు. టైటిల్ను గెలుచకుని ‘మిస్టర్ ఇండియా-2021’గా ఎంపికయ్యాడు. ఎత్తు, బరువు, వ్యక్తిగత విభాగాలు కలిపి మొత్తం 10 కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా 80 కిలోల విభాగంలో సాగర్ కతుర్థే విజేతగా నిలిచారు. రన్నరప్గా ఆర్.కార్తికేశ్వర్, ఫస్ట్ రన్నరప్గా ఎం.శరవణన్ నిలిచారు. వీరిద్దరూ తమిళనాడు చెందిన వారే.