ఖైరతాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం సోమాజిగూడలోని జయగార్డెన్స్లో వేడుకగా జరిగింది. సమావేశానికి ముందు మేయర్ , ఎమ్మెల్యే దానం నాగేందర్ , హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె. ప్రసన్న, సోమాజిగూడ, వేంకటేశ్వరకాలనీ డివిజన్ల కార్పొరేటర్లు వనం సంగీత యాదవ్ , మన్నె కవితా రెడ్డితో కలిసి టీఆర్ ఎస్ జెండాను ఆవిష్కరించారు.
వారికి జూబ్లీహిల్స్కు చెందిన కార్యకర్తలు సాంప్రదాయ బంజారా వేషదారణలో స్వాగతం పలికారు. మేయర్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఇటీవల డివిజన్ల వారీగా కమిటీలు వేసుకున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. త్వరలోనే డివిజన స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తామన్నారు.
సంక్షేమ పథకాలపై ప్రతి కార్యకర్తకు అవగాహన ఉండాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరించా లన్నారు. కల్యాణలక్ష్మి, షాదిముబారక్ , సీఎంఆర్ ఎఫ్ లాంటి పథకాలలో మంజూరైన చెక్కులను ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అప్పగించాలని, అప్పుడే వారు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారన్నారు. వచ్చే నెల 15న వరంగల్ లో జరుగనున్న విజయగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి తరలివచ్చే వారి జాబితాను డివిజన్ వారిగా సిద్ధం చేయాలన్నారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 119 నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరుపుకుంటున్నామని తెలిపారు. వరంగల్లో జరిగే విజయగర్జనకు పది లక్షలకు పైగా కార్యకర్తలు తరలివస్తారని, నియోజకవర్గం నుంచి కూడా వేలాదిగా తరలిరావాలన్నారు. విజయగర్జనకు వచ్చే కార్యకర్తలు తమ పేర్లను ముందస్తుగా నమోదు చేసుకోవాలని, ప్రధానంగా మహిళా కార్యకర్తలను ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.
నవంబర్ 14 లోపు తమ జాబితాను ఇవ్వాలని, వారి కోసం అక్కడ సకల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభకు వెళ్లి వచ్చేందుకు ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయగర్జనకు తరలివెళ్లే బస్సులను మంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మినారాయణమ్మ, టీఆర్ ఎస్ ఖైరతాబాద్ , సోమాజిగూడ, వేంకటేశ్వరకాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాత్ నగర్ డివిజన్ల అధ్యక్షులు కె. అరుణ్ కుమార్ , ఎస్కె అహ్మద్ , రాములు హాన్ , షేక్ నాసర్ , వి. చంద్రశేఖర్ , ఎస్. యాదగిరి, సీనియర్ నాయకులు మామిడి నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.