మియాపూర్ : వర్షాకాలంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గత ప్రభుత్వాలు వీటిని విస్మరించాయని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా తీసుకుని పనులను ముమ్మరంగా చేపడుతుందన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రూ. 6 కోట్లతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను విప్ గాంధీ ప్రాజెక్టు అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ఏండ్ల తరబడి ముంపుతో సతమతమవుతున్న ధరణీనగర్ను నాలా విస్తరణతో తాము రక్షించినట్లు పేర్కొన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ముంపు సమస్య నెలకొంటున్న ప్రాంతాలలో నాలాల విస్తరణను ముమ్మరంగా చేపడుతున్నామని, ప్రజల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని విప్ గాంధీ పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాలలో తగు చర్యలు ముందస్తుగా చేయటం ద్వారా సమస్య పునరావృతం కాకుండా ఉంటుందన్నారు. నాలా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, చెత్త ఇతర వ్యర్థాలను నాలాల్లో వేయవద్దని గాంధీ కోరారు. జీహెచ్ఎంసీ, ప్రాజెక్టు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని విప్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డీఈ రాంచందర్ పాల్గొన్నారు.