స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి కౌంటింగ్పైకి మళ్లింది. ఈ నెల 14న జరుగనున్న కౌంటింగ్ కోసం నల్లగొండలో ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు గెలుపోటములపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.ఈ ఎన్నికల్లో సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు ఉన్న ఓట్లతో విజయం ఖాయమనేది ముందు నుంచి ఉన్న చర్చే.కాకపోతే, పోలింగ్ అనంతరం టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,జడ్పీ చైర్మన్లతో కలిసి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహరచనే కారణమన్న చర్చజరుగుతున్నది.పోలింగ్ రోజున విపక్ష ఓటర్లు ఊహించని విధంగా
పార్టీలకు అతీతంగా కలిసిరావడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తున్నది. దాంతో టీఆర్ఎస్కు వాస్తవంగా ఉన్న ఓట్ల కంటే అదనంగా కనీసం రెండొందల నుంచి మూడొందల ఓట్లతో ఘన విజయం సాధిస్తుందన్న అంచనాలు పెరిగిపోయాయి. అదే జరిగితే మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహం ముందు ఉద్దండ నేతలున్న జిల్లాగా చెప్పుకొనే నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడినట్లే! ఈ ప్రభావం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపబోతుందన్న చర్చ జోరుగా సాగుతున్నది.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్11 (నమస్తే తెలంగాణ) : స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన పోలింగ్లో 1,271 ఓట్లకు 1,233 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. అయితే విపక్షాలకు ఉన్న ఓట్లను బట్టి చూస్తే ఈ స్థాయిలోనూ పోలింగ్ జరుగ్సాలింది కాదు. కానీ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు చెందిన అభ్యర్థ్ధులు బరిలో లేకపోయినా ఆ పార్టీల ఓటర్లు సైతం ఓటింగ్కు వచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. వాస్తవంగా జిల్లాలో మొత్తం ఓటర్లలో టీఆర్ఎస్కు 820, కాంగ్రెస్కు 384, బీజేపీకి 35, సీపీఎంకు 18, సీపీఐకి 5, ఇతరులు 9 మంది ఉన్నారు. టీఆర్ఎస్ ఓట్లు మినహాయిస్తే ఇతరులన్నీ 400పై చిలుకు ఓట్లు ఉన్నాయి.
దీంతో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థ్ధులు బరిలో లేకపోవడంతో ఈ ఓటర్లంతా పెద్దగా ఓటింగ్పై ఆసక్తి కనబరుస్తారో లేదోనన్న చర్చ పోలింగ్ కంటే ముందు ఉంది. కానీ తీరా పోలింగ్ రోజున దాదాపు ఓటర్లంతా తరలివచ్చారు. కేవలం 38 మంది మాత్రమే ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో పోలింగ్ భారీగా జరుగడంపై టీఆర్ఎస్ మెజార్టీ చర్చనీయాంశంగా మారింది. అనుకున్న దానికంటే భారీగా టీఆర్ఎస్కు ఓట్లు పోలైనట్లుగా పోలింగ్ సరళి కూడా స్పష్టం చేసింది. దీనికంతటికీ జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చేసిన వ్యూహరచనే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పకడ్బందీ వ్యూహం
మంత్రి జగదీశ్రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే తనదైన శైలిలో కసరత్తు మొదలుపెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డిని అధినేత కేసీఆర్ ఖరారు చేశాక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జీలతో పలుదఫాలుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఇందులోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. నామినేషన్ల నాటి నుంచే దీన్ని అమలులో పెట్టారు.
నామినేషన్ల దాఖలులోనూ ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పాటు మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలను కూడా భాగస్వామ్యం చేశారు. తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా ఓటర్లతో సమావేశాలు కూడా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన అన్ని సమావేశాల్లోనూ మం త్రి జగదీశ్రెడ్డి కీలకంగా పాల్గొనగా కొన్నిచోట్ల ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, మరికొన్ని చోట్ల ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో పాటు ఆయా నియోజకవర్గ అవసరాలకు అనుగుణంగా జడ్పీ చైర్మ న్లు, ఇతర ముఖ్యులు కూడా హాజరయ్యారు. వీటిల్లోనే అందులో టీఆర్ఎస్ ఓటర్లు ఎంతమంది? విపక్ష ఓటర్లు ఎంత మంది? మనతో కలిసొచ్చే అవకాశాలు ఉన్న వారు ఎంతమంది? ఇలా అని లెక్కలు తీశారు. పార్టీకి ఉన్న వాస్తవ సంఖ్య బలం ఖరారు అయ్యాక ఇతర పార్టీల ఓటర్లపై దృష్టి పెట్టాలని భావించారు. దీంతో ముందుగా నియోజకవర్గాల వారీగా ఓటర్లతో భేటీ అయ్యాక వారికి ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఒకటికి రెండు సార్లు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇదంతా చేస్తూనే మరోవైపు ఇతర పార్టీల నుంచి కలిసొచ్చే ఓటర్లపైనా దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా దీనిపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లలో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని పావులు కదిపారు.
పట్టించుకోని కాంగ్రెస్ ఉద్ధండులు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందే చేతులెత్తేసింది. గెలుపుపై ఆశలు లేకపోయినా పోటీ ఇచ్చే అవకాశం మాత్రం ఉంది. కానీ దాన్ని కూడా జిల్లా నుంచి ఉద్ధండులుగా చెప్పుకునే ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి వారు కనీసం పట్టించుకోలేదు. చివర్లో మాత్రం ఏకగ్రీవం కాకుండా తమ పార్టీకే చెందిన వారిని స్వతంత్ర అభ్యర్థ్ధులుగా బరిలో దింపగలిగారు. వారిని కూడా తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పరిణామాలను గమనిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి తనదైన శైలిలో పావులు కదిపారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నేతల తీరుతో విసిగిపోయిన ఓటర్లపై దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి వీరందర్నీ పోలింగ్ కేంద్రాలకు తీసుకురాగలిగారు. బహిరంగంగానే పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్కు మద్దతుగా ఓటేస్తూ కనిపించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలతో పాటు ఇతరులు సైతం చివర్లో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వారిలో ఎక్కువ మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. పోలింగ్ రోజు ఈ పరిణామాలన్నింటినీ గమనించిన కాంగ్రెస్ జడ్పీటీసీగా ఉన్న స్వతంత్ర అభ్యర్థ్ధి కుడుదుల నగేశ్ తీవ్రంగా స్పందించక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీని అనాథను చేస్తూ ముఖ్య నేతలంతా సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ఇక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి అంతంత మాత్రంగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల, ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.