కొత్తగూడెం సింగరేణి, జనవరి 8 : సింగరేణి కాలరీస్ కంపెనీ.. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు రికార్డు స్థాయిలో రూ.1,070 కోట్ల లాభాలు గడించింది. సరికొత్త రికార్డును సృష్టించింది. గతేడాది ఇదే కాలానికి రూ.842కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్న సంస్థ.. ఈ ఏడాది అద్భుతమైన టర్నోవర్ ఫలితంగా 227 శాతం వృద్ధి నమోదు చేసుకున్నది. గతేడాది తొలి 9 నెలల్లో బొగ్గు, విద్యుత్ కలిపి రూ.11,986 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు 58 శాతం వృద్ధితో రూ.19 వేల కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది బొగ్గు ద్వారా రూ.9,525 కోట్ల అమ్మకాలు జరిపిన సంస్థ, ఈ ఏడాది కరోనా పరిస్థితులను కూడా అధిగమించి ఉత్పత్తి, రవాణాను గణనీయంగా పెంచుకున్నది. దీని ద్వారా 69 శాతం వృద్ధితో రూ.16,110 కోట్ల అమ్మకాలు సాధించింది. గత 9 నెలల్లో 318 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన కంపెనీ, ఈ ఏడాది 52 శాతం వృద్ధితో 484 లక్షల టన్నుల బొగ్గు రవాణ చేసింది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గతేడాది కంటే మెరుగైన రీతిలో అమ్మకాలు నమోదుచేసుకున్నది. 5,353 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన చేయగా, ఈ ఏడాది తొలి 9 నెలల్లో 6,904 మిలియన్ యూనిట్ల (30 శాతం వృద్ధి) విద్యుత్ ఉత్పత్తి చేసింది. గతేడాది సాధించిన రూ.2,461 కోట్ల అమ్మకాలపై 17 శాతం వృద్ధితో ప్రస్తుతం రూ.2,892 కోట్ల అమ్మకాలు జరిపింది.
రికార్డు స్థాయిలో అమ్మకాలు, లాభాలు..
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో అమ్మకాలు, లాభాల్లో సింగరేణి గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు అభినందనలు. మిగిలిన 3 నెలల కాలంలో విద్యుత్ వినియోగం బాగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పాదన కూడా బాగా పెంచాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా గణనీయమైన వృద్ధితో సింగరేణి చరిత్రలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.27 వేల కోట్ల మేర టర్నోవర్, రికార్డు స్థాయిలో లాభాలు, గడించే దిశగా కృషి చేయాలి. అన్ని ఏరియాల్లో పూర్తి స్థాయి యంత్ర వినియోగంతో రోజూవారీగా, గనుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి.