మార్చి 12లోపు యూనిట్ల గ్రౌండింగ్
తొలి విడుత నియోజక వర్గానికి 100 మందికి..
ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు రూ.50 కోట్లు విడుదల
దశల వారీగా అందరికీ.. ఎలాంటి అపోహలు వద్దు
తయారీ, మార్కెటింగ్ అవసరాలపై సహకారం
సూర్యాపేట, జనవరి 30(నమస్తే తెలంగాణ) ;రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.. ఫిబ్రవరి 5నాటికి సూర్యాపేట జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానుంది.. నియోజకవర్గానికి వంద చొప్పున తొలివిడుత 400 మంది దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందనున్నాయి. ఇప్పటికే జిల్లాకు రూ.50 కోట్లు వచ్చాయి. స్కీం ఇంప్లిమెంట్ కోసం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. క్షేత్ర స్థాయిలో కమిటీలు ఉంటాయి. స్కీం దశల వారీగా దళితులందరికీ వర్తిస్తుంది.. ఇందులో ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదు.. అనేక స్కీంలు ఉన్నా దళితుల జీవితాలను మార్చేసే అద్భుత స్కీం దళిత బంధు. షరతులు లేకుండా వందశాతం సబ్సిడీతో వచ్చే పథకం ఇది.. లబ్ధిదారులు ఏ యూనిట్ ఎంచుకున్నా.. వారికి కావాల్సిన సలహాలు, సూచనలు, మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం తరఫున ఎప్పుడూ ఉంటుంది. వారు ఆర్థిక పరిపుష్టి సాధించే వరకూ అధికార యంత్రాంగం తోడ్పాటు ఉంటుంది’ అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో దళిత బంధు అమలుపై ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
జిల్లాకు రెండు విడుతల్లో దళిత బంధు పథకం వర్తిస్తుంది. ముందుగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం మొత్తానికి వర్తింపజేస్తాం. దాదాపు 2,500దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున తొలి విడుతలో మంజూరు కాగా, తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి వంద మంది చొప్పున స్కీం వర్తింపజేసేలా తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో మరో 400 మందికి లబ్ధి కలుగనున్నది. 400 కుటుంబాలకు మార్చి నెలాఖరు నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే, మార్చి 12 నాటికే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి
దళితులు అయితే చాలు.. నాలుగు నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున ఫిబ్రవరి 5 నాటికి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎంపిక ప్రక్రియకు ప్రత్యేకంగా కార్యాచరణ అంటూ ఏమీ ఉండదు. దళితులై, స్థానికుడైతే చాలు. ఇప్పటికే తొలి విడుతగా జిల్లాకు రూ.50 కోట్లు వచ్చాయి. పథకం అమలుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం పూర్తయ్యింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారు పనిచేస్తుంటారు. క్షేత్ర స్థాయిలో కమిటీలు ఉంటాయి.
ఆర్థికంగా బలోపేతం అయ్యే వరకూ నిరంతర పర్యవేక్షణ
దళిత బంధు లబ్ధిదారులకు రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఉండదు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికీ ఓ బృందం వెళ్తుంది. యూనిట్ ఎంపిక మొదలుకుని యూనిట్ పని విధానం, నెలవారీ ఆదాయ, వ్యయాలు, మార్కెటింగ్ తదితర అన్నింటినీ పర్యవేక్షిస్తారు. లబ్ధిదారులు ఆర్థిక పరిపుష్టి సాధించేంత వరకూ పర్యవేక్షణ కొనసాగుతుంది.
యూనిట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు..
లబ్ధిదారుల ఎంపిక మాత్రమే జిల్లాలో జరుగుతుంది. లబ్ధిదారులు ఎంచుకునే వ్యాపారమైనా, వాహనాలు, ఇతర యూనిట్లు ఏవైనా సరే రాష్ట్రంలో ఎక్కడ లాభాలు వస్తాయనుకుంటే అక్కడే పెట్టుకోవచ్చు.