రంగారెడ్డి జిల్లాలోని 83 బ్లాకుల్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ చర్యలు
‘హరితవనాలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధికారులు
దట్టమైన అడవులే లక్ష్యంగా మొక్కల పెంపకం
ఇప్పటికే సిద్ధంగా కోటి మొక్కలు
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 29 : దట్టమైన అడవుల పెంపకానికి రాష్ట్ర సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే హరితహారంతో పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచిన ప్రభుత్వం.. అడవుల శాతాన్ని సైతం పెంచేందుకు తాజాగా ‘హరితవనాలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రానున్న రెండేండ్లలో జిల్లావ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో 3 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేశారు. ఇప్పటికే ఖాళీ స్థలాలను గుర్తించగా.. జనవరి నుంచి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఔషధ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం కోటి మొక్కలు సిద్ధంగా ఉండగా, మిగతావాటిని వచ్చే జూన్లోపు అందుబాటులోకి తెచ్చేందుకు నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. మొక్కల పెంపకానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వినియోగించనున్నారు. కాగా, జిల్లాలోని ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలో 83 బ్లాకులుండగా, 29,282 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉన్నది.
రానున్న రెండేండ్లలో జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని దట్టమైన అడవులుగా మార్చేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రాంతాలను గుర్తించి సంబంధిత ప్రాంతాల్లో మొక్కలను నాటేందుకు నిర్ణయించారు. జిల్లాలోని మొత్తం అటవీ ప్రాంతాన్ని హరితవనాలుగా మార్చడమే లక్ష్యంగా జిల్లా అటవీ శాఖ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటుతుండగా, తాజాగా హరితవనాలు కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చే రెండేండ్లలో జిల్లాలోని అడవులను ఎక్కడా చూసినా చిట్టడవులా మాదిరిలా మార్చేందుకు ప్లాన్ చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రాంతమంతా హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉంటుంది కాబట్టి పచ్చదనాన్ని మరింత పెంపొందించేలా చర్యలు చేపట్టారు. అయితే హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 6 కోట్ల మొక్కలను నాటడం పూర్తి చేశారు. అంతేకాకుండా పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాలోని ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలో 83 బ్లాకులుండగా, 29,282 హెక్టార్లలో అటవీ ప్రాంత విస్తీర్ణం ఉంది.
రెండేండ్లలో దట్టమైన అడవులుగా మార్చడమే లక్ష్యం..
జిల్లాలో అటవీ ప్రాంత విస్తరణపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాలు సమృద్ధిగా కురువడంతో పర్యావరణ పరిరక్షణకుగాను అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రతీ ఏడాది ఎంతో కొంతమేర అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న అటవీ శాఖ యంత్రాంగం జనవరి నుంచి అధిక మొత్తంలో అటవీ ప్రాంతంలో మొక్కలను నాటేందుకు నిర్ణయించారు. ముఖ్యంగా రెండేండ్లలో జిల్లాలోని అటవీ ప్రాంతాలను దట్టమైన అడవులుగా మార్చడమే లక్ష్యంగా జిల్లా అటవీ శాఖ ముందుకెళ్తున్నది. జిల్లాలో ఎక్కడైతే అటవీ ప్రాంత విస్తీర్ణం తక్కువగా ఉందో సంబంధిత అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడంపై జిల్లా అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఇందులోభాగంగా హరితవనాల కార్యక్రమానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు. జనవరి నుంచి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రాంతాల్లో మొక్కలను నాటనున్నారు. మొక్కలను నాటే కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా చేపట్టేందుకు నిర్ణయించారు. మీటరుకు ఒక మొక్క చొప్పున నాటేందుకు నిర్ణయించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రెండేండ్లలో జిల్లాలోని అటవీ ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతంగా మార్చేలా మీటరుకు ఒక మొక్కను నాటనున్నారు.
జిల్లాలోని ఆమనగల్లు, శంషాబాద్ డివిజన్లలోని 83 బ్లాకుల్లో ఇప్పటికే ఖాళీ ప్రాంతాలను గుర్తించిన జిల్లా అటవీ శాఖ అధికారులు సంబంధిత ఖాళీ ప్రదేశాల్లో 3 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికను రూపొందించారు. అయితే జనవరి నుంచి అటవీ ప్రాంతాల్లో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో కోటి మొక్కలు అందుబాటులో ఉండగా, వచ్చే ఏడాది జూన్ వరకు మిగతా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేసేలా చర్యలు చేపట్టారు. సంబంధిత కార్యక్రమానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వాడుకోనున్నారు. అటవీ ప్రాంతాల్లో ఔషధ మొక్కలను కూడా నాటనున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నెమలినార, నారవేపి, బూరుగ, కానుగ, రావి, అల్లనేరేడు, మర్రి, చింత, జువ్వి, ఇప్ప, నారవేప, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, ఏరుమద్ది, నల్లమద్ది, టేకు, చిందుగ, సీతాఫల్, ఉసిరి, మారేడు తదితర మొక్కలను నాటనున్నారు. ఇవేకాకుండా వేప, కాచు, దర్శనం, అల్లనేరేడు, వేరుమద్ది, ఉసిరి, రావి, నెమలినార, కానుగ, తెల్ల విరుగుడు, మర్రి, మేడి, నారవేప, చిన్నంగి, ఇప్పా, మామిడి, జీడి, దొరిసేన, గన్నేరు, చిల్లగింజ, చింత, టేకు, తెల్లమద్ది, కరక్కాయ, ఇనుముద్ది, అంకుడు చెట్టు, పెద్ద రేగు, పరాకి, ముష్టిగంగ, పెద్ద గుమ్ముడు టేకు, అజఘ్నము, అడ్డాకు, కలేచెట్టు, పసుపు, పెద్ద మాను, చిందుగ, చిరుమాను, చారుమామిడి, మోదుగ, జిల్లేడు తదితర ఔషధ మొక్కలను నాటనున్నారు.
3కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక : జిల్లా అటవీశాఖాధికారి జానకీరాం
జిల్లాలో హరితవనాలు కార్యక్రమంలో భాగంగా 3 కోట్ల మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాం. వచ్చే రెండేండ్లలో జిల్లాలోని అటవీ ప్రాంతాలన్నీ దట్టమైన అడవులుగా మార్చేందుకు చర్యలు చేపట్టాం. జనవరి నుంచి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే మీటరుకు ఒక మొక్కను నాటేందుకు నిర్ణయించాం. అంతేకాకుండా మొక్కలను నాటడంతోపాటు మొక్కల సంరక్షణకు కూడా చర్యలు చేపట్టాం.