అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి
రామన్నపేట, నవంబర్ 29 : రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మిల్లర్లు, లారీ యజమానులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని దుబ్బాక, ఎన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లు, ఎగుమతుల వివరాల రికార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మిల్లు యజమానులు నూక పేరుతో అడ్డగోలుగా కోతలు విధిస్తున్నారని, దిగుమతి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని, లారీ యజమానులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లారీలకు ప్రభుత్వమే కిరాయి చెల్లిస్తుందని, రైతులు అదనంగా డబ్బులు ఇవ్వవద్దని అన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ సూరజ్కుమార్, డీఎస్ఓ బ్రహ్మరావు, సివిల్ సైప్లె డీఎం గోపీకృష్ణ, డీసీఓ ప్రవళిక, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీటీసీ మడూరి జ్యోతీరాంచందర్ పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి సమస్యలను త్వరగా పరిశీలించి శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో అందే ఫిర్యాదులపై సమగ్రంగా చర్యలు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. మొత్తం 44 ఫిర్యాదులు అందాయని, అందులో 25 రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలున్నట్లు తెలిపారు.