ఎకరంన్నర పొలంలో వివిధ రకాల పంటల సాగు
సంవత్సరానికి మూడు పంటలు తీస్తున్న రైతు
క్యాబేజీ, టమాట, క్యారెట్,ఈత వనం సాగు
అన్ని పంటలకూ సేంద్రియ ఎరువే వాడకం
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు
నవాబుపేట, నవంబర్ 29 : కొద్దిపాటి పొలంలో వివిధ రకాల కూరగాయలు సాగుతో లాభాలను గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలస్తున్నాడు నవాబుపేట మండల కేంద్రానికి చెందిన శివకుమార్ గౌడ్. డిగ్రీ వరకు చదువుకుని నాలుగు ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. రెండేండ్ల నుంచి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. అతడికి ఎకరంన్నర పొలం ఉన్నది. అందులో అర ఎకరంలో క్యాబేజీ, మరో అర ఎకరంలో క్యారెట్, పది గుంటల్లో టమాట పండిస్తున్నాడు. మిగిలిన పది గుంటల్లో 300 ఈత మొక్కలను నాటి సంరక్షిస్తున్నాడు. వరి సాగు చేసినప్పుడు శ్రమ ఎక్కువగా ఉండేదని, ఖర్చు అధికంగానే ఉండేదని పేర్కొంటున్నాడు. క్యాబేజీ, క్యారెట్, టమాట పంటలను మార్చి వేయడంతో భూసారం పెరుగడంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు రైతు శివకుమార్గౌడ్. పంట మార్పిడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, ఎండాకాలంలో మాత్రం బోరుబావిలో నీరు తగ్గినా నిరంతర కరెంట్ వల్ల సరిపోతున్నదని వివరించాడు. ఈ ఎకరంన్నర పొలంతో పాటు వేరేచోట మరో ఎకరం పొలం ఉండగా, అందులో కంది, మొక్కజొన్న, పెసర పంటలను మార్పిడి చేస్తూ ఉంటామని పేర్కొన్నాడు. ప్రతి పంటకు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులను మాత్రమే వాడుతున్నామన్నాడు.
ఈత వనం పెంపకం చాలా బాగుంది..
పది గుంటల భూమిలో ఈత మొక్కలను నాటామన్నాడు. ఈత మొక్కలు ఎనిమిది సంవత్సరాలు ఎదిగిన తర్వాత కల్లు గీతకు అనుకూలంగా మారుతాయన్నారు. ప్రస్తుతం ఈత మొక్కలు నాటి మూడు సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ఈత మొక్కలకూ సేంద్రియ ఎరువునే వాడుతున్నామన్నారు. ఈత మొక్కల పెంపకానికి ఖర్చు చాలా తక్కువేనని వివరించారు.
ఆడుతూ పాడుతూ సాగు చేస్తున్నా..
అవసరమైనప్పుడు కూలీలతో పని చేయిస్తా. రోజుకు రూ.350 కూలీ ఇస్తా. చదువుకుని రైతుగా మారడం చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. ఆడుతూ పాడుతూ వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నా
రైతులను ప్రోత్సహిస్తాం..
ఆరుతడి పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తాం. ప్రభుత్వం బీర, సొర, కాకర, దొండ, వంటి తీగ జాతి కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నది. తీగ జాతి కూరగాయలు సాగు చేయాలనుకునే రైతు లు తమను సంప్రదిస్తే కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందిస్తాం. ఎకరాకు యూనిట్ రూ. 2 లక్షలు ఇస్తాం. అందులో రూ.లక్ష సబ్సిడీ ఉంటుంది. ఇది ఉద్యానవన పంటలకు మాత్రమే వర్తిస్తుంది.