నందికొండ, నవంబర్ 29 : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం ప్రారంభమైంది. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి, లాంచీ స్టేషన్ మేనేజర్ హరిబాబు, ఎస్ఐ నర్సింహారావు జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నందికొండ నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన లాంచీ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరుకుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీశైలంలో బయల్దేరి సాయంత్రానికి నాగార్జునసాగర్కు చేరుకోనుంది. తొలిరోజు 20 మంది ప్రయాణికులతో వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులో వచ్చిన మరో 60 మంది పర్యాటకులతో నాగార్జునసాగర్కు చేరుకుంటుంది. రెండు రోజుల పాటు కొనసాగే శ్రీశైలం లాంచీ ప్రయాణంలో పర్యాటకులకు జలపాతాల అందాలు, జింకలు, దుప్పులు, నదికి ఇరువైపులా నల్లమల కొండలు, అలలపై ప్రయాణం మధురానుభూతి పర్యాటకులకు కలిగించనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పర్యాటకశాఖ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. త్వరలో కొత్త లాంచీస్టేషన్ పర్యాటకులకుఅందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. పర్యాటక శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ ప్రయాణంలో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. కౌన్సిలర్ మంగ్తా, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, కార్యదర్శి భూషరాజు కృష్ణ, మోహన్నాయక్ పాల్గొన్నారు.
మొదటి సారిగా లాంచీలో వెళ్తున్నాం
మొదటిసారిగా లాంచీలో శ్రీశై లం వెళ్తున్నాం. గతం లో వెళ్లి వచ్చినవారు లాంచీ ప్రయాణం బాగుంటుందని చెప్పడంతో మేమూ వెళ్తున్నాం. అధికారులు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు బాగా చేశారు. లాంచీలో పోవడం సంతోషంగా ఉంది.