ముత్తంగి మహాత్మా జ్యోతిబాఫూలే
గురుకులంలో వెలుగు చూసిన కరోనా
47మంది విద్యార్థినులు, లెక్చరర్కు కొవిడ్ పాజిటివ్
470 మంది విద్యార్థినులకు ర్యాపిడ్ టెస్టులు
ఆర్టీపీసీఆర్ కోసం హైదరాబాద్కు నమూనాలు
గురుకులంలోనే క్వారంటైన్
అనారోగ్యంతో ఉన్న వారికి తీసుకెళ్తున్న పేరెంట్స్
భరోసా కల్పిస్తున్న ఉపాధ్యాయ బృందం
గురుకులాన్ని సందర్శించిన డీఎంహెచ్వో, ఆర్డీవో
పటాన్చెరు, నవంబర్ 29 : సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ మండలం ముత్తంగి మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 48 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కలకలం చెలరేగింది. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల/కళాశాలలో సోమవారం 48 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం జ్వరంతో బాధపడుతున్న పదోతరగతి విద్యార్థిని ఇంటికి వెళ్లడంతో మొదటి పాజిటివ్ కేసు వెలుగు చూసింది. ఆమెతో పాటు ఉంటున్న పదోతరగతి విద్యార్థినులకు కూడా ఆదివారం పరీక్షలు చేస్తే వారిలోనూ పాజిటివ్ కేసులు రావడంతో ఆధికారులు తక్షణం పాఠశాల, జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. 470మందికి పరీక్షలు నిర్వహించగా, 47మంది విద్యార్థినులు కొవిడ్ పాజిటివ్గా తేల్చారు. ఒక లెక్చరర్కు కూడా పాజిటివ్ వచ్చింది. సోమవారం వరకు 48మందికి కరోనా పాజిటివ్ నమోదైంది. పదోతరగతి విద్యార్థినులు అధికంగా 38మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంటర్ విద్యార్థినులు 9మంది కరోనా పాజిటివ్గా తేల్చారు. వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి గాయత్రి గురుకులాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. స్వయంగా విద్యార్థినులతో మాట్లాడి, ఇంటికి వెళ్తామన్న వారికి పంపించే ఏర్పాట్లు చేయించారు. గురుకులంలో చదువుతున్న అందరు విద్యార్థినులకు ర్యాపిడ్ పరీక్షలు చేయించారు. అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించారు.
పాఠశాల, కళాశాల స్టాఫ్ మొత్తానికి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యశాఖ సిబ్బందిని, ఏఎన్ఎంలను, పాఠశాల నర్సును అక్కడే ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. హాస్టల్ రూంలలో 5మందికి మించి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. పాజిటివ్గా తేలినవారికి ప్రత్యేకంగా క్వారంటైన్రూంలలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రిన్సిపాల్ భీష్మాచారి పాజిటివ్గా తేలిన విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి, వారి పిల్లలకు కరోనా వచ్చిన విషయాన్ని తెలిపారు. ప్రిన్సిపాల్ సమాచారంతో తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను తమతో తీసుకొని వెళ్తున్నారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది వారికి ట్యాబ్లెట్లు, కరోనా రక్షణ కిట్లను అందిస్తున్నారు. కరోనా నెగెటివ్ వచ్చిన విద్యార్థినులకు క్లాసులు కొనసాగుతున్నాయి. పదోతరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్న వేళ కరోనా సోకడం కలకలానికి కారణమైంది. సంగారెడ్డి ఆర్డీవో నగేశ్, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్రెడ్డి గురుకులాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. ఆదివారం రోజు కొందరు విద్యార్థినులు ఇండ్లకు వెళ్లి వచ్చినట్లు, పేరెంట్స్ కూడా పిల్లలను చూసేందుకు రావడంతో కరోనా వ్యాపించి ఉంటుందని ప్రాథమికంగా ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
నివారణ చర్యలు తీసుకుంటున్నాం..: డీఎంహెచ్వో గాయత్రి
శనివారం ఒక కరోనా పాజిటివ్ కేస్ నమోదయ్యిందని తెలియడంతో వెంటనే ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఆదివారం 288 మందికి పరీక్షలు నిర్వహించాం. వారిలో స్టాఫ్ కూడా ఉన్నారు. వారిలో 43మంది పాజిటివ్గా తేలారు. వారికి టెస్టులు చేయడం పాటు జీనోమ్ సిక్వెన్స్ కోసం హైదరాబాద్కు నమూనాలు పంపిస్తున్నాం. పాజిటివ్ ఉన్నవారిని ఐసోలేషన్లో పెట్టాం. కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. వైద్య సిబ్బంది సేవలు కొనసాగుతాయి.
హుస్నాబాద్ ఆర్డీవోకు కరోనా పాజిటివ్
హుస్నాబాద్, నవంబర్ 29 : హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు గమనించిన ఆయన సాధారణ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. దగ్గు అధికం కావడంతో అనుమానం వచ్చి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోగా, పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని, హుస్నాబాద్ ఇన్చార్జి ఆర్డీవోగా సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.