బీపీ, మధుమేహంరోగులకు ఉచితంగా మందులు
వచ్చే నెల నుంచి పంపిణీకి ఏర్పాట్లు
వికారాబాద్ జిల్లాలో 21వేల మంది బీపీ పేషెంట్లు
10వేల మంది మధుమేహం రోగులు
పరిగి, నవంబర్ 28: ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను అందిస్తున్నది. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్(మధుమేహం) వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులను అందజేయాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి నాన్ కమ్యూనబుల్ డిసీజెస్(ఎన్సీడీ) కిట్లను పంపిణీ చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 21వేల మంది బీపీ పేషెంట్లు ఉండగా, 10వేల మంది మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా షుగర్, బీపీ రోగులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మధుమేహం (షుగర్), బీపీ, హైబీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు డిసెంబర్ నుంచి నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కిట్లు అందజేస్తారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం సుమారు 21వేల మంది బీపీ, హైబీపీతో బాధపడుతున్నారు. కాగా 10వేల మంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ ఈ మందులను ఆయా సబ్సెంటర్ల వారీగా ఉచితంగా అందజేయనున్నారు. నెల రోజులకు సరిపడా మందులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మందుల కిట్లను ఆరోగ్య ఉప కేంద్రాలకు వచ్చే బీపీ, షుగర్ రోగులకు అందజేస్తారు. ఇతరులకు ఆశా వర్కర్ల ద్వారా పంపిణీ చేసే అవకాశం ఉన్నది. అంతేకాకుండా మరింత ఆరోగ్యవంతంగా జీవించేందుకు సూచనలు కూడా ఇవ్వనున్నారు.
ప్రతి సబ్ సెంటర్లో స్క్రీనింగ్..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి సబ్ సెంటర్లో వివిధ రకాల వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో సుమారు 9లక్షలకు పైగా జనాభా ఉంది. అందులో 30 ఏండ్లు పైబడిన వారు 37శాతం మంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలామందికి బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీంతో అధికారులు గ్రామస్థాయి నుంచి ఇందుకు సంబంధించిన సర్వే చేపడుతున్నారు. వీరందరికీ బీపీ, షుగర్ పరీక్షలతోపాటు ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలపై సర్వే కొనసాగనున్నది. ఈ సర్వేకు సంబంధించి వైద్య శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రశ్నాపత్రం అందజేస్తారు. వాటి ఆధారంగా సబ్ సెంటర్లకు వచ్చే వారిని వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యాధికారికి తెలియజేస్తారు. జిల్లాలో 154 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఇప్పటికే 56 పల్లె దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సర్కారు నిర్ణయించింది. మిగతా వాటిని విడుతల వారీగా మార్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పేదలకు మేలు చేసే నిర్ణయం..
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పేదలకు మేలు కలుగనున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ఈ వ్యాధిగ్రస్తులు డబ్బులున్నప్పుడే మందులు కొనడం, నిత్యం వేసుకోకపోవడంతో దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం కిట్ రూపంలో నెలకు సరిపడా మందులు అందజేయడంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ వ్యాధులు నియంత్రణలో ఉండడంతో ఇతర వ్యాధులు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఎన్సీడీ కిట్ల పంపిణీ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అవసరమైన వారికి మందులిస్తాం..
వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు బీపీతో 21వేల మంది, షుగర్ వ్యాధితో 10వేల మంది బాధపడుతున్నారు. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఎన్సీడీ కిట్లు అందజేస్తాం. జిల్లావ్యాప్తంగా 154 సబ్ సెంటర్లలో బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతున్నది. దీంతో ఏ వ్యాధులు ఉన్నా పరీక్షించి, వారికి ఉచితంగా చికిత్సలు, మందులు అందజేస్తాం.