కనుమరుగైన వ్యవసాయ బావులు
చేతి పంపులు పాయె..
ఇంటింటికీ భగీరథ తాగు నీరు వచ్చే
కోట్పల్లి, నవంబర్ 28 : రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. గతంలో సాగునీటి కోసం వ్యవసాయ బావులను వాడుకునేవాళ్లం. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వ్యవసాయ రంగం కష్టతరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో తాగునీటి కోసం చేదుడు బావుల్లో బొక్కెన్లతో చేదుకుని తాగు నీరు తెచ్చుకునే వారు. రానురాను భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయి గ్రామాల్లోని చేతి పంపులు సైతం కనుమరుగయ్యాయి. వేసవి కాలం వచ్చిందంటే తాగునీటి ఇబ్బందులు అంతా ఇంతా కాదు.. ఉదయం నుంచి సా యంత్రం వరకు మహిళలు అక్కడక్కడ ఉన్న కుళాయిల వద్ద బిందెడు తాగునీటి కోసం బారులు తీరేవారు. ఇక ముందు వ్యవసాయానికి, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉండరాదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సాగునీటి శాశ్వత పరిష్కారానికి మిషన్ కాకతీయతో కుంటలు, చిన్న చిన్న చెరువుల్లో పూడికతీత కార్యక్రమాలను ఉధృతం చేసింది. దాంతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీటితో వ్యవసాయానికి ఇబ్బందులు తీరాయి. వేసవిలో మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడవద్దని శాశ్వత పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకంతో గ్రామాల్లోని ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన తాగునీటిని అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. దీంతో గ్రామాల్లోని మహిళలు తాగునీటి ఇబ్బందులు తీరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సర్కారు వ్యవసాయం, రాష్ట్ర ప్రజల కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకు దేశంలో ఎక్కడా లేని పథకాలు, ఎవ్వరూ చేయని అభివృద్ధిని చేసి నేడు దేశంలో కేసీఆర్ సర్కారు చరిత్రను సృష్టించింది. గ్రామాల్లో అభివృద్ధితో పాటు పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ముందుకు సాగుతున్నది. మండలంలోని 18 పంచాయతీల్లోని మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో 17 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటింటికీ కుళాయిలదారా తాగునీటిని అందిస్తున్నది. 18 పంచాయతీలకు గాను 21659 జనాభాతో 21 ఆవాస కేంద్రాలున్నాయి. ఈ ఆవాస కేంద్రాలకు ప్రతినిత్యం తాగునీటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నది. మిష న్ భగీరథ పథకంతో గ్రామాల్లో వేసవి కాల ఇబ్బందులను పూర్తిగా తొలగించింది.
చాలా సంతోషంగా ఉంది
మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో వేసవికాలంలో వచ్చే తాగునీటి ఇబ్బందులు దూరమయ్యాయి. మిషన్ భగీరథతో గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేసి శుద్ధి నీటిని అందించడం అభినందనీయం. దేశ చరిత్రలో ఏ సీఎం చేపట్టని పథకాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం చాలా సంతోషం. తాగునీటి ఇబ్బందులు తొలిగించడంతో మహిళలు సీఎం కేసీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో తాగునీటి ఇబ్బందులతో రోడ్లపై రాస్తారోకోలు, ధర్నాలు చేసిన మహిళల కష్టాలను శాశ్వతంగా తొలగించిన సీఎం కేసీఆర్ సర్కారుకు రుణపడి ఉంటాం.