ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 28 : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి దళారుల ప్రమేయం లేకుండా పూర్తి భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నేరుగా ధాన్యాన్ని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. వరి పంట రైతుల చేతికందే సమయంలో కేంద్ర ప్రభుత్వం మొహం చాటేసినప్పటికీ రాష్ట్ర సర్కార్ ముందుకువచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇప్పించే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరుగటంతో ప్రభుత్వం అదనంగా మరో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఉన్న కొనుగోలు కేంద్రాలు సరిపోవన్న ఉద్దేశంతో అదనంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. నియోజకవర్గంలోని మంచాల మండలంలో నూతనంగా ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే, యాచారం మండలంలోని నందివనపర్తి, మాల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో మరో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అధికారులు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 11 కొనుగోలు కేంద్రాలున్నాయి. వీటిలో మంచాల మండలంలోని నోముల, మంచాల, బోడకొండ, యాచారం మండలంలో యాచారం, చింతపట్ల, ఇబ్రహీంపట్నం మండలంలో దండుమైలారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో గౌరెల్లి, బాచారం, బండరావిరాల, కోహెడ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం అదనంగా నాలుగు కొనుగోలు కేంద్రాలు పెంచడంతో నియోజకవర్గంలో 15కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. అదనంగా ఎలిమినేడులో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేడో, రేపో ప్రారంభించనున్నారు. జిల్లాలోని రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించడంతో మధ్యదళారుల ప్రమేయం లేకుండానే రైతులు నేరుగా తమ ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు పెట్టుబడుల పేరుతో రైతులకు అప్పులు ఇచ్చి ధాన్యాన్ని అతితక్కువ ధరలకే కొనుగోలు చేసేవారు. కాని, ప్రభుత్వం మధ్యదళారుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించింది. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేలా వ్యవసాయ మార్కెట్కమిటీ అధికారులు నడుం బిగించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.
నియోజకవర్గంలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వం 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిని సహకార సంఘాలతో పాటు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మంచాల మండలంలో మంచాల, లోయపల్లి, ఆరుట్ల, బోడకొండ, యాచారం మండలంలో యాచారం, చింతపట్ల, ఇబ్రహీంపట్నం మండలంలో దండుమైలారం, పోల్కంపల్లి, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో గౌరెల్లి, బాచారం, బండరావిరాల, కోహెడ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.