రాహు, బొచ్చె, తదితర రకాలు విడుదల
ఈ సారి రొయ్య పిల్లలు సైతం..
మత్స్యకారులకు మరింత జీవనోపాధి
కడెం, నవంబర్ 28 : మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నది. తరతరాలుగా చేపలు పడుతూ ఉపాధి పొందుతున్న వారిని ఆదుకునేందుకు ఊతమిస్తున్నది. గతంలో మత్స్యకారులు పారిశ్రామిక సంఘంగా ఏర్పడి చేపపిల్లలను యూనిట్గా దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకునేవారు. పెట్టిన పెట్టుబడులు రాక తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారి సంక్షేమానికి కృషి చేస్తూ ఉచితంగానే పంపిణీ చేస్తున్నది. నిర్మల్ జిల్లాలో ఐదు జలాశయాలు, 207 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 489 గ్రామ పంచాయతీ చెరువులున్నాయి. వీటిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో యేటా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది సైతం జిల్లాలో 4.99 కోట్ల పిల్లలను విడుదల చేయగా..ఇందులో రాహు, బొచ్చే తదితర రకాలతో పాటు రొయ్యలూ ఉన్నాయి.
కడెం జలాశయం పరిధిలో కడెంతో పాటు, పెద్దూర్, చుట్టు పక్కల గ్రామాల మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. కడెం, పెద్దూర్ గ్రామాలు కలిపి మత్స్య పారిశ్రామిక సొసైటీని ఏర్పాటు చేసుకొని కొన్నేళ్లుగాఉపాధి పొందుతున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూట జలాశయానికి వెళ్లి వీరు వేట సాగిస్తారు. పట్టుకొచ్చిన చేపలను సొసైటీ ద్వారానే అమ్ముకుంటారు. ఈ సొసైటీ పరిధిలో 150 కుటుంబాలున్నాయి. వారందరికీ జలాశయమే ప్రధాన జీవనాధారం. కడెం, పెద్దూర్ సొసైటీతో పాటు ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలోనూ మత్స్యకారుల సొసైటీ ఉంది. ఇక్కడ వదిలిన చేపలు జలాశయం అంతటా విస్తరించి తిరుగుతాయి. దీంతో కడెం సొసైటీతో పాటు బీర్నంది మత్స్యకారులకూ ఉపాధి దొరుకుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో విడుదల చేసిన చేప పిల్లలు ఆరు నెలల్లో కిలో, సంవత్సరంలో రెండు కిలోల బరువు పెరుగుతాయి. యేటా ఇలా చేపలను వదలడంతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి ద్వారా మత్స్యకారులను ఆదుకుంటున్నది.
జిల్లాలో ఐదు జలాశయాలు, 696 నీటి వనరులు..
నిర్మల్ జిల్లాలో 53,636 హెక్టార్ల నీటి విస్తీర్ణం ఉంది. ఇందులో ఐదు జలాశయాలు, 207 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 489 గ్రామ పంచాయతీ చెరువులున్నాయి. వీటిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది చేపపిల్లలను విడుదల చేస్తున్నారు. కడెం జలాశయంలో 18.34 లక్షలు, శ్రీరాంసాగర్లో 62.37 లక్షలు, స్వర్ణ ప్రాజెక్టులో 17.08 లక్షలు, సుద్దవాగు ప్రాజెక్టులో 27.16 లక్షల చొప్పున ఈసారి చేపపిల్లలను విడుదల చేశారు. జిల్లాలోని 63 చెరువుల్లో సైతం ఇప్పటికే 30.31లక్షల చేపపిల్లలను వదిలారు. రానున్న రోజుల్లో కడెం మండలకేంద్రంలో చేపల మార్కెట్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మత్స్యకార సంఘాలకు భవన నిర్మాణాలను పూర్తి చేశారు. సబ్సిడీపై వాహనాలను సైతం అందించి వారి ఉపాధికి భరోసా కల్పిస్తున్నారు. 2020-21 సంవత్సరానికి 85.51 లక్షల రొయ్య పిల్లలను సైతం విడుదల చేశారు.
మత్స్యకార కుటుంబాలకు భరోసా..
జిల్లాలో 197 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. రూ.10 లక్షల యూనిట్ విలువతో మొత్తం 37 కమ్యూనిటీ భవనాలు నిర్మించారు. చేపల చెరువుల నిర్మాణాలకు సైతం సహకరిస్తున్నారు. మత్స్య అభివృద్ధి పథకం ద్వారా రూ.10 లక్షలతో సారంగాపూర్, భైంసాలో మంజూరు చేశారు. నిర్మల్ పట్టణంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా రూ.50 లక్షల యూనిట్ విలువైన హోల్సేల్, రిటైల్ మార్కెట్ మంజూరు చేశారు. కడెం, శ్రీరాంసాగర్, గోదావరిలో చేపలు పట్టేందుకు 2,500 మంది మత్స్యకారులకు ప్రభుత్వం లైసెన్స్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దానికి మించి 2,800 మందికి లైసెన్స్లు అందజేశారు. పీఎంఎస్బీవై పథకం కింద లైసెన్స్ కలిగిన మత్స్యకారులు ప్రమాదరీత్యా మరణిస్తే వారికి రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 75 శాతం సబ్సిడీలతో రూ.22.68 కోట్లతో 3,703 ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, సంచార చేపల అమ్మకం వాహనాలు, పరిశుభ్ర చేపల అమ్మకం వాహనాలు, పోర్టబుల్ కియోస్క్లు, ప్లాస్టిక్ చేపల కిట్స్, వలలు, ఇన్సులేట్ ట్రక్లు, ఫిష్ఫుడ్ కియోస్క్లు, కొత్త చేపల చెరువుల నిర్మాణాలు, చేప పిల్లల రేగింగ్ యూనిట్లు అందజేశారు. ఎన్ఎఫ్డీబీ పథకం ద్వారా మూడు మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్లెట్స్ను 60 శాతం సబ్సిడీతో నిర్మల్ జిల్లాకు మంజూరు చేశారు. నూతన చెరువుల కోసం రూ.7 లక్షలు, హచేరీల నిర్మాణం కోసం రూ.25 లక్షలు, ఇన్సులేటెడ్ వాహనాల కోసం రూ.25 లక్షలు, చేపల మినీ దాణా మిల్లు కోసం రూ.3 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. కేజ్కల్చర్ విధానం ద్వారా యూనిట్ విలువ రూ.30 లక్షలు కాగా.. సర్కారు 80 శాతం రాయితీతో రూ.24 లక్షలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
చేప, రొయ్య పిల్లల పంపిణీ
జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో అనుకున్న లక్ష్యం మేరకు చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమాన్ని పూర్తి చేశాం. విడుతల వారీగా చెరువుల్లో, జలాశాయాల్లో పంపిణీ నిర్వహించాం. నూతనంగా లైసెన్స్లు కావాల్సిన మత్స్యకారులు దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 9 వేల మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నాం.