చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
అవగాహన పెంచుకొని హక్కులు కాపాడుకోవాలి
ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి
జహీరాబాద్లో ఘనంగా న్యాయ దినోత్సవం
జహీరాబాద్, నవంబర్ 27 : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. శనివారం జహీరాబాద్ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవం(న్యాయ దినోత్సవం) నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికి హక్కులు కల్పించారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్లో నెల రోజులుగా న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారన్నారు. ప్రపంచలోనే ఉన్న పలు దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు పరిశీలించి, భారత్ దేశంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగంలో ఉన్న చట్టాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మంచి కార్యక్రమలు నిర్వహించిన జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాపాడుకోవాలి : కరుణ కుమార్, జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి
రాజ్యాంగంలో ఉన్న హక్కులు తెలుసుకొని, వాటిని కాపాడుకోవాలని జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి కరుణకుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు పర్యటించి, దేశ రాజ్యాంగం రాశారన్నారు. పార్లమెంట్, శాసన సభలో ఎలాంటి చట్టలు తయారు చేయాలి, బడ్జెట్ ఎలా ఉండాలో చూపించారన్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా రాజ్యాంగం రాశారన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జూనియర్ సివిల్ జడ్జి అనుషా, జహీరాబాద్ బార్ అధ్యక్షుడు దత్తాత్రేయారెడ్డి, ఏజీపీ సయ్యద్ అహ్మద్, అడిషనల్ పీపీ సోలోమాన్, డీఎస్పీ జీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్, సీనియర్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, అంజయ్య,శ్రీనివాస్రెడ్డి , శ్రీనివాస్ ఖన్నా, ఎస్సైలు శ్రీకాంత్, కాశీనాథ్, రవి, రాజశేఖర్తో పాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.