పెరుగుతున్న సైబర్ మోసాలు
వ్యక్తిగత రుణాలు, ఉద్యోగాలు అంటూ మెసేజ్లు
నమ్మితే మోసపోయినట్లే..
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఫిర్యాదులు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
24 గంటల్లో ఫిర్యాదు చేస్తే డబ్బుల రికవరీ
రామాయంపేట్/ వెల్దుర్తి/ అమీన్పూర్, నవంబర్ 27;ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యవస్థలన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి నడుస్తున్నాయి. పెద్దపెద్ద కంపెనీల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దీన్ని వినియోగిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీతో మంచి జరుగుతున్నా కొన్ని సందర్భాల్లో చెడు కూడా జరుగుతున్నది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల చేతిలో టెక్నాలజీ దుర్వినియోగమవుతున్నది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కేటుగాళ్లు ఏదో ఒక రూపంలో గాలం వేసి మోసం చేస్తున్నారు. సెల్ఫోన్లకు రకరకాల మెసేజ్లు పంపిస్తూ డెబిట్కార్డు, క్రికెట్ కార్డు పిన్, ఇంటర్నెట్ పాస్వర్డ్ తదితర విషయాలు అడిగి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కాజేస్తున్నారు.
గతంలో లాటరీ గాలం..
మీ ఫోన్ నంబర్కు లాటరీ తీశాం. అందులో మీరు రూ. కోటి గెలుచుకున్నారు. డబ్బు కావాలంటే ముందుగా మీ వివరాలతో పాటు నిర్ధ్దిష్టమైన మొత్తం ఫీజును చెల్లించాలి అంటూ గతంలో చాలా మందికి మెసేజ్లు వచ్చేవి. దీంతో, నిజమే అని నమ్మి డబ్బులు కట్టి చాలా మంది అమాయకులు లక్షల రూపాయలు మోసపోయారు. అయితే, పోలీసులు పెద్ద ఎత్తున సైబర్ మోసాలు, నేరాలపై అవగాహన కల్పిస్తుండడం, ప్రజలు కూడా ఇంటర్నెట్ వాడుతూ ఎక్కువ విషయాలను తెలుసుకుంటుండడంతో. ఈ తరహా మోసాలు తగ్గాయి. దీంతో మోసగాళ్లు కూడా కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత రుణాలు, ఉద్యోగాల పేరుతో మోసానికి ఒడిగడుతున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు.. మీకు వ్యక్తిగత రుణం మంజూరైందని లేదా మీకు జాబ్ వచ్చిందని చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారు. తరువాత వారు ఇచ్చే లింక్లను క్లిక్ చేయమని చెబుతున్నారు. అలా చేసిన వెంటనే బ్యాంకు వివరాలను సేకరించి వేల రూపాయలను నిమిషాల వ్యవధిలోనే కాజేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు బాగా పెరిగిపోయాయి.
నిత్యం ఫిర్యాదులు..
సైబర్ నేరాలపై ఉమ్మడి మెదక్ జిల్లాలోని పోలీస్స్టేషన్లలో నిత్యం కేసులు నమోదవుతున్నాయి. అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో రోజుకు 6-7 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వస్తున్నాయి. క్రైమ్ జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోగా పోయిన మొత్తాన్ని తిరిగి ఇప్పించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే https:// cybercrime.gov.in/ అనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ప్రజలు ఫిర్యాదు చేస్తే సత్వరమే సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.
వ్యక్తిగత రుణం అంటూ మెసేజ్ వచ్చింది..
మూడు లక్షల రూపాయల వ్యక్తిగత రుణం మంజూరైంది. కావాలంటే వెంటనే లింక్ క్లిక్ చేయండి అంటూ ఇటీవలే ఓ మెసేజ్ వచ్చింది. నేను ఏ రుణం కోసం దరఖాస్తు చేయలేదు. దీంతో అనుమానం వచ్చింది. వెంటనే జాగ్రత్త పడ్డా. లేదంటే నష్టపోయేవాడిని. ప్రజలు ఇలాంటి విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డబ్బులను నష్టపోతారు.
అప్రమత్తంగా ఉండాలి..
సైబర్ మోసాలపై ప్రజలను ఎంత అప్రమత్తం చేస్తున్నా.. నేరగాళ్ల చేతికి చిక్కుతున్నారు. అందువల్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకింగ్ లేదా కార్డుల వివరాలను అపరిచితులకు చెప్పకూడదు. సోషల్ మీడియాలో లేదా ఫోన్లకు వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దు. 100 శాతం అలాంటి లింక్లు మోసపూరితమైనవి అయ్యే ఉంటాయి. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు. ఓటీపీ, పిన్ వివరాలను చెప్పకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం..
సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఫేక్కాల్స్ లిఫ్ట్ చేయొద్దని చెబుతున్నాం. కొంతమంది వ్యక్తులు ఫేస్బుక్ను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ అయితే వెంటనే అప్రమత్తం కావాలి. ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. మేము చేస్తున్న చైతన్య కార్యక్రమాలతో రామాయంపేట్ పోలీస్ సర్కిల్ పరిధిలో మూడు నెలల్లో ఒక్క సైబర్ కేసు నమోదు కాలేదు.