ఇచ్చిన మాటకు కట్టుబడిన తెలంగాణ సర్కారు
ఒప్పంద ఉద్యోగులకు 30 శాతం వేతనాల పెంపు
కేజీబీవీ, యూఆర్ఎస్, సర్వశిక్షా ఉద్యోగులకు వర్తింపు
ఖమ్మంలో 644 మందికి, భద్రాద్రిలో 464 మందికి లబ్ధి
బోనకల్లులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 27: చాలీచాలని వేతనాలతో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీతాలను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తున్నట్లుగా ఒప్పంద ఉద్యోగులకూ 30 శాతం వేతన పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని అమలు చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఒప్పంద ఉద్యోగుల్లో భాగంగా కేజీబీవీ, యూఆర్ఎస్, సర్వశిక్ష అభియాన్లలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 30 శాతం ఫిట్మెంట్ను ఇచ్చి విశాల థృక్పదాన్ని చాటుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ వేతనాల పెంపునకు సంబంధించి జీవో నెంబర్ 117ను శనివారం విడుదల చేసింది.
ఖమ్మంలో 644 మందికి లబ్ధి..
ఒప్పంద ఉద్యోగులకు వేతన పెంపులో భాగంగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న 644 మందికి లబ్ధి చేకూరనుంది. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు, ఇతర సిబ్బందితోపాటు యూఆర్ఎస్, సర్వశిక్షా అభియన్లో పనిచేస్తున్న వారందరికీ 30 శాతం వేతన పెంపు వర్తించనుంది. ప్రాజెక్టు కార్యాలయంలో 10 మంది, కేజీబీవీల్లో 312 మంది, అర్బన్ డిప్రాయిడ్లో 14 మంది, ఎంఆర్సీలో 126 మంది, సీఆర్పీల్లో 119 మంది, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లలో 63 మందికి ప్రయోజనం చేకూరనుంది.
భద్రాద్రిలో 464 మందికి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 464 మందికి ప్రయోజనం కలుగుతుంది. జిల్లాలో కేజీబీవీలో 287 మంది, ఎంఐఎస్, సీసీవో, ఐఈఆర్పీల్లో 75 మంది, సీఆర్పీలు, పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లలో 102 మంది కలిపి మొత్తం 464 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
సిబ్బంది, సంఘాలు హర్షం..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై శనివారం విడుదల చేయడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
బోనకల్లు, నవంబర్ 27: అసెంబ్లీలో ప్రకటించిన విధంగా సమగ్రశిక్ష ఉద్యోగులకు 30 శాతం వేతనం పెంచుతూ సీఎం కేసీఆర్ జీవో 117ను విడుదల చేసినందుకు సీఆర్పీల సంఘం బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్పాషా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బోనకల్లు ఎంఆర్సీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు.
మాట నిలబెట్టుకున్న సీఎం..
కేజీబీవీ ఒప్పంద ఉద్యోగులకు వేతన పెంపుపై మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక సీఎం.. కేసీఆరే. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఒప్పంద ఉద్యోగులకూ వేతన పెంచడం ఇదే మొదటిసారి. వేతనం పెంపు ఆసరా అవుతుంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో మరింత బాధ్యతగా పని చేసి ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేస్తాం.
-ఝాన్సీసౌజన్య, కేజీబీవీల సంఘం జిల్లా అధ్యక్షురాలు