సమున్నత స్థానం కల్పించిన అధినేత కేసీఆర్
సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అభినందనలు
దేవరకొండలో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
సమన్వయంతో సమర్ధవంతగా పని చేస్తా : రవీంద్రకుమార్
దేవరకొండ, జనవరి 26 : టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నియమితులయ్యారు. ప్రజా క్షేత్రంలో ఉంటూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మద్దతు కూడగట్టుకున్న గిరిజన బిడ్డకు పార్టీ అధినేత సమున్నత స్థానం కల్పించారు. దేవరకొండ మండలం శేరుపల్లి గ్రామ పరిధిలోని రత్యాతండాకు చెందిన రవీంద్రకుమార్ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఎంపికపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్తూ దేవరకొండలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేశారు. ప్రకటన అనంతరం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మినిస్టర్స్ క్వార్టర్స్లో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో టీఆర్ఎస్ను మరింత బలోపేతం కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని మంత్రి గుంటకండ్ల సూచించారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
గిరిజన బిడ్డ, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేవరకొండ మండలంలోని ఉమ్మడి శేరుపల్లి గ్రామ పరిధిలోని రత్యతండాకు చెందిన రమావత్ రవీంద్రకుమార్ రెండు పర్యాయాలు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీపీఐ నుంచి టికెట్ పొంది 2004లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో సైతం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అభివృద్ధికి అకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తిరుగలేని మెజారిటీ సాధించి మూడోసారి జయకేతనం ఎగురవేశారు. పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న రవీంద్రకుమార్ సేవలను గుర్తించిన అదిష్ఠానం పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. నియామకం అనంతరం మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
నియోజకవర్గంలో సంబరాలు..
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులు కావడంపై నియోజకవర్గ ప్రజలు సంబురాలు చేశారు. టీఆర్ఎస్ కార్యాకర్తలు పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు హన్మంత్ వెంకటేశ్ గౌడ్, ఉస్మాన్, శిరందాసు కృష్ణయ్య, జయప్రకాశ్ నారాయణ, అశోక్, మహ్మద్ రైస్, బాబా, బొడ్డుపల్లి కృష్ణ మాడెం రాములు, ఇలియాస్ పటేల్, ఎన్ఎన్చారి పాల్గొన్నారు.