శాస్ర్తోక్తంగా స్వాతీనక్షత్ర పూజలు
స్వామివారి ఖజానాకు 12,12,004 ఆదాయం
యాదాద్రి, జనవరి 26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. వేకువజామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. నారసింహుడి జన్మనక్షత్రం సందర్భంగా బాలాలయ మండపంలో 108 శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలశాల్లోని జలాలకు పాంచరాత్రగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిపారు. పాలు, పెరుగు, వివిధ శుద్ధి జలాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో సుమా రు రెండు గంటలపాటు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను రథసేవలో తీర్చిదిద్ది బాలాలయ మండపంలో ఊరేగించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంంగా భక్తులు వేకువజామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అష్టోత్తర శతఘటాభిషేకం పూజల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
బాలాలయంలో ప్రత్యేక పూజలు..
స్వామివారి బాలాలయంలో బుధవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అన్ని విభాగాలను కలుపుకొని శ్రీవారి ఖజానాకు 12,12,004 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.