తుర్కపల్లి, జనవరి 26 : దళిత కుటుంబాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు. సీఎం దత్తత గ్రామం తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్, ఎస్సీ సంక్షేమ శాఖ, సీఎంఓ కార్యదర్శి రాహుల్బొజ్జా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతువేదిక భవనంలో దళితబంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. దళితబంధు లబ్ధిదారుల మనోగతాలను, వారు ఏర్పాటు చేసుకున్న యూనిట్లు, ఆదాయం, ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్మితా సబర్వాల్ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యమై ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని గ్రామసభలో తీర్మానం చేసి తమకు పంపిస్తే ఆ నివేదికను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామన్నారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉన్నప్పుడే ఆదర్శవంతమైన గ్రామం అవుతుందని సూచించారు. గృహాలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, అంతర్గత రోడ్లు, పంచాయతీ భవనంతోపాటు యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను నెలకొల్పుకోవచ్చన్నారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగమంతా బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.
క్షేత్రస్థాయికి..
అధికారులు గ్రామంలో మొదటగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుంచి కాలినడకన రామాలయం సమీపంలోని దళితవాడలో కలియ తిరిగి లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.