ఆరేండ్ల కింద మూసివేసే స్థితికి చేరిన బడి
ఇప్పుడు కార్పొరేట్ను తలపించేలా విద్యాబోధన
డిజిటల్ పాఠాలు, ఆంగ్ల మీడియం
మర్కూక్/గజ్వేల్ రూరల్, జనవరి 26 :విద్యార్థులు లేక మూతబడే స్థితికి చేరిన అంగడి కిష్టాపూర్ పాఠశాల ఇప్పుడు కళకళలాడుతున్నది. ఆరేండ్ల కింద 12మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఇప్పుడు 174 మంది చదువుతున్నారు. ప్రైవేట్కు దీటుగా ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తుల కృషితో ఇప్పుడు ఈ పాఠశాల ఆదర్శంగా మారింది. ఈ బడిలో నాణ్యమైన విద్య అందుతుండడంతో గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేట్కు పంపించడం మానేశారు. ఆరు రోజుల పాటు రోజుకో తరగతి చొప్పున డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలకు ఆదరణ పెరుగుతున్నది.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఆరేండ్ల క్రితం 12 మంది విద్యార్థులతో కనిపించేది. విద్యార్థులు లేక పాఠశాలను మూసి వేసే పరిస్థితి ఉన్న సమయంలో పాఠశాలకు అప్పట్లో నియామకమైన ఉపాధ్యాయుడు ఓంకార్రాధాకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని, గ్రామస్తులను చైతన్య పర్చడానికి ఎంతో శ్రమించారు. గ్రామంలోని యువకుల సహాయంతో ఎనిమిదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. గణతంత్ర దినోత్సవం రోజున పాఠశాలకు వచ్చిన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన బోధన అందించి, గ్రామ పిల్లల బాధ్యతను తాము తీసుకుంటామని వారిలో భరోసా కల్పించారు. అంతే, ఉపాధ్యాయుల మాట ప్రకారం.. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. దీంతో 2015 జూన్లో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించారు. ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను తల్లిదండ్రులే సమకూర్చుకున్నారు. అప్పటి నుంచి నేటికి ఎనిమిదో తరగతి వరకు గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరారు. 2014-15లో 12మంది విద్యార్థులతో ఉన్న పాఠశాల, ఆరేండ్లలోనే 174మందికి చేరుకుంది. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించిన ఉపాధ్యాయుడు ఓంకార్ ప్రభావం నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలపై పడింది.
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
పాఠశాలలో 174 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రతీ ఒక్కరిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి నెలా విద్యార్థుల తలిదండ్రులతో పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. చదువులో విద్యార్థుల ప్రమాణ స్థాయిని తెలుసుకొని, తల్లిదండ్రులు చెప్పే వారిపై కొంత ప్రత్యేక శ్రద్ధను చూపించి, వారిని కూడా అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ఇక్కడి పాఠశాలలో కొనసాగుతున్నాయి. నాణ్యమైన బోధనతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మించి ఆంగ్లంలో మాట్లాడడంతో పాటు వివిధ అంశాలను అనర్గళంగా చెబుతారు.
ఆహ్లాదకర వాతావరణం..
పాఠశాల ఆవరణలోకి అడగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం అందరినీ కట్టిపడేస్తుంది. రెండు గదులు, మరో రెండు రేకుల షెడ్లలో ఎనిమిదో తరగతి వరకు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలకు ప్రస్తుతం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు వస్తున్నారు. పక్కనే ఉన్న చెబర్తి, నర్సన్నపేట, ఎర్రవల్లి, అలిరాజ్పేట, తిగుల్, గణేశ్పల్లి, గజ్వేల్ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
తరగతుల వారీగా డిజిటల్ బోధన..
వారంలో ఆరు రోజుల పాటు రోజుకో తరగతి చొప్పున డిజిటల్ బోధన అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కో రోజు ఒక తరగతికి సమయాన్ని కేటాయించి, సిలబస్తో రూపుదిద్దుకున్న డీవీడీలతో ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు బోధన అంశాలను చూపిస్తారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ బోధనకు ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుల ఆలోచనతో నేడు ప్రతి విద్యార్థి అన్ని అంశాలపై పట్టుసాధించే ఆవశ్యకత లభించింది. కార్పొరేట్ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే డిజటల్ బోధనను చేపడుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్కు పాఠశాల తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ఉపాధ్యాయులు నిరూపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతుండగా, వారికి గ్రామస్తులు ఎంతో సహకరించారు.
ప్రహరీపై ఆకట్టుకునే చిత్రాలు..
పాఠశాల ఆవరణలోకి అడుగుపెట్టగానే ఆకట్టుకునేలా గోడలపై చిత్రాలు, బొమ్మలు వేశారు. ప్రపంచపటం, భారతదేశం, పార్లమెంట్, తెలంగాణ రాష్ట్రం, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్, తెలుగు, ఇంగ్లిష్ రైమ్స్, వివిధ కులవృత్తులకు సంబంధించిన చిత్రాలు గోడలపై అందంగా వేయించారు. వీటి ద్వారా విద్యార్థులు నేర్చుకున్న ప్రతీ అంశాన్ని మర్చిపోలేరు.
అన్ని రంగాల్లో రాణించేలా..
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. మూసి వేసే స్థితిలో ఉన్న పాఠశాలను నేడు జిల్లాలోనే అందరి మన్ననలు పొందే స్థాయికి ఎదగడంలో గ్రామస్తుల సహకారం మరిచిపోలేనిది. అధికారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పాఠశాల అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తాం.-ఓంకార్ రాధాకృష్ణ, హెచ్ఎం, అంగడికిష్టాపూర్ స్కూల్
పేదలపై ఆర్థిక భారం తగ్గుతుంది..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ ప్రారంభించడం చాలా సంతోషకరం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పేదల చదువులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు మెరుగులు దిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.7300 కోట్లు కేటాయించడం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి పాఠశాలలో వసతులు కల్పించడం గొప్ప విషయం. ఇక ప్రైవేటు పాఠశాలల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు.-ఎన్. కిషన్రెడ్డి, పీఆర్టీయూ నారాయణరావుపేట మండల అధ్యక్షుడు
ఖర్చు లేకుండానే కార్పొరేట్ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనుండడం మంచి పరిణామం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధనతో కార్పొరేట్ స్థాయి విద్య అందనున్నది. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఖర్చు ఉండదు. ప్రైవేటు వైపు విద్యార్థులు మొగ్గు చూపరు. ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొన్నాళ్ల పాటు పాఠశాలలో కొనసాగించాలి. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వంలో సర్కారు బడులకు మంచి రోజులు వచ్చాయి. కారణాలేవైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది. దానికి అనుగుణంగా పాఠశాలలో తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.