పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు, జనవరి 26 : తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం కర్ధనూర్ గ్రామ పరిధిలోని పల్లె ప్రకృతివనంలో తెలంగాణ తల్లి, ఏపీజే అబ్దుల్కలాం, మహాత్మాగాంధీ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో ఎక్కడ చూసినా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రేరణను, బాధ్యతలను గుర్తు చేశాయని తెలిపారు. మహాత్మాగాంధీ అహింసా పోరాటంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు కొనియాడారు. అబ్దుల్ కలాం ఎందరో యువకులకు మార్గదర్శిగా నిలిచారని తెలిపారు. కర్ధనూర్ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని, అభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన అంగన్వాడీ, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే కుమార్, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, ఎంపీడీవో బన్సీలాల్, కార్యదర్శి నీలిమా, టీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, గోల్కొండ లక్ష్మణ్, సత్యనారాయణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.