యూనిట్ల ఎంపికపై లబ్ధిదారుల కోసం సరళమైన నిర్ణయాలు
1985లోనే దళిత జ్యోతిని ప్రారంభించిన కేసీఆర్
మార్చి నాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రౌండింగ్
జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ
సూర్యాపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ) ‘రక్తపాతం లేకుండా అహింసాయుతంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే తోవలో ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమ రీతిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి దేశమే నివ్వెర పోయేలా విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అలాంటి మరో మహత్తర పథకమే
దళిత బంధు. సాధారణంగా ఎక్కడైనా సంక్షేమ పథకాలు అంటే వెయ్యి, రెండు వేల లబ్ధి చేకూర్చడం, విద్య, వైద్యం కోసం సాయం చేయడం వంటివి ప్రభుత్వాలు చేస్తుంటాయి. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు ఆర్థిక పరిపుష్ట్టి కల్పించేందుకు ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తుండడం నూతన విప్లవమే. దశాబ్దాల తరబడి వివక్షకు గురవుతూ వచ్చిన దళితుల సమగ్రాభివృద్ధికి, వారు సగర్వంగా జీవించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి పథకాలతో రాష్ట్రం, దేశం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుందనేది సీఎం కేసీఆర్ నమ్మకం. సమాజంలోని సామాజిక రుగ్మతలకు దళిత బంధు ఓ చికిత్స కూడా. కేవలం దళితులకే గాక దశల వారీగా అన్ని వర్గాల్లోని పేదలకు ఇలాంటివి అమలు చేయడం జరుగుతుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. దళితుల జీవితాల్లో కొత్త కాంతులు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై నమస్తే తెలంగాణకు మంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన దళిత బంధు ఎక్కడా దుర్వినియోగం కాకుండా కఠిన నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ మార్చి చివరి నాటికి గ్రౌండింగ్ పూర్తికానున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు, యూనిట్ల ఎంపిక, గ్రౌండింగ్, తొలి దశ లక్ష్యం, అమలు,
కార్యాచరణపై మంత్రి గుంటకండ్ల వివరించిన విశేషాలు 8వ పేజీలో…
నమస్తే తెలంగాణ : దళిత బంధుపై స్పందన ఎలా ఉంది?
మంత్రి జగదీశ్రెడ్డి: సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లోనే కాదు, సామాజిక మార్పులోనూ దేశానికే తెలంగాణ మార్గదర్శకం కావాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇతర వర్గాల నుంచి కొంత ఈర్షాద్వేషాలు వస్తాయని, రాజకీయంగా కొంత నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని తెలిసినా భయపడకుండా దళిత బంధుపై ముందుకు పోవడం అనేది ఆయన గొప్ప సంకల్పానికి నిదర్శనం. ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, నష్టాలు ఎదురవుతాయి. తదనంతరం వచ్చే సత్ఫలితాలను అందరూ అర్థం చేసుకుంటారని సీఎం కేసీఆర్ నమ్ముతారు. ఇక, కేవలం దళితులకే గాక దశల వారీగా అన్ని వర్గాల్లోని పేదలకు ఇలాంటివి అమలు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు.
నమస్తే తెలంగాణ : దళిత బంధు ఆలోచనా మూలాల గురించి చెప్తారా?
మంత్రి జగదీశ్రెడ్డి : నేడు దేశ వెనుకబాటుకు ప్రధాన కారణం మానవులందరి శక్తియుక్తులను సరైన రీతిలో ఉపయోగించకపోవడమేనన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ విషయాల పట్ల నాటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. ఈ నిచ్చెన మెట్ల సమాజం ఎలా ఉంది. రేపటి తెలంగాణ ఎలా ఉండాలి. దేశానికి తెలంగాణ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఎలా ఉంటుంది అనేది కేసీఆర్ ఆనాడే చెప్పేవారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే సిద్ధిపేటలో దళిత జ్యోతి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దళితవాడల్లో కూర్చుని దళితుల కష్టాలు విన్నారు. కన్నీళ్లు తుడిచారు.
నమస్తే తెలంగాణ : దళిత బంధు అమలు ఎలా ఉంటుంది?
మంత్రి జగదీశ్రెడ్డి : ప్రతి కుటుంబానికీ 10 లక్షల రూపాయలు ఇవ్వబోయే దళిత బంధు పథకం అమలులో ఇసుమంతైనా అవినీతికి ఆస్కారం లేదు. దుర్వినియోగం అన్నదే లేకుండా ప్రతి లబ్ధిదారుడికి సులభతరమైన పద్ధతిలో అందేలా, పక్కదారి పట్టకుండా, నిరుపయోగం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు పొందుపర్చింది. ముఖ్యమత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించి నిబంధనలు పెట్టించారు. అలాగే ఈ పథకంపై లబ్ధిదారులు కూడా అవగాహన పెంచుకోవాలి. తద్వారా ప్రతి ఒక్కరూ తమ హక్కులు తెలుసుకుంటారు. గత ప్రభుత్వాల్లో ఏ పథకమైనా ప్రజల్లోకి వెళ్లాలంటే గ్రౌండ్కు వెళ్లే సరికి 75 శాతం కూడా లబ్ధిదారుడికి దక్కేది కాదు. అంతా నిరుపయోగం, దుర్వినియోగం, అవినీతిమయం. అలాంటి పరిస్థితి ఉండొద్దనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సీఎం కేసీఆర్ ప్రతి పథకాన్నీ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
నమస్తే తెలంగాణ : పథకం అమలులో దళిత రక్షణ నిధి పాత్ర?
మంత్రి జగదీశ్రెడ్డి : దళిత బంధు లబ్ధిదారులు ఆర్థిక పరిపుష్టి సాధించే వరకు ప్రభుత్వ శాఖలు సపోర్ట్గా ఉంటూ గైడ్ చేస్తుంటాయి. అనివార్య కారణాలతో ఎవరైనా నష్టపోతే ఆదుకునేందుకే సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఇదొక అరుదైన, అద్భుతమైన పథకం.అనుమానాలకు తావే ఉండద
నమస్తే తెలంగాణ : యూనిట్ నెలకొల్పిన తర్వాత ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఎలాంటి సహకారం ఉంటుంది?
మంత్రి జగదీశ్రెడ్డి : లబ్ధిదారులు తమకు అనుభవం ఉన్న, ఆసక్తి గల వ్యాపారం ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఎవరు ఎలాంటి యూనిట్ తీసుకున్నా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఇప్పిస్తుంది. రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రసక్తి ఉండదు. లబ్ధిదారు కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించే వరకు వ్యాపారం, మార్కెటింగ్లో మెళకువలు నేర్పడం, ఆర్థిక పరమైన నిర్మాణం, వ్యాపార నిర్మాణంపై తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది.
నమస్తే తెలంగాణ : గ్రౌండింగ్ ఎప్పటివరకు చేస్తారు?
మంత్రి జగదీశ్రెడ్డి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ మార్చిలోపు గ్రౌండింగ్ పూర్తి చేస్తాం. ఆ వెంటనే వ్యాపారాలన్నీ ప్రారంభమవుతాయి.
నమస్తే తెలంగాణ : లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుంది?
మంత్రి జగదీశ్రెడ్డి : ఆయా నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఒక గ్రామంలో 20 కుటుంబాలు ఉంటే వారందరినీ లబ్ధిదారులుగా చేసి మరో గ్రామాన్ని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే కదా అని ఎవరికీ ఎలాంటి రాజకీయ అపోహలు అవసరం లేదు. అన్ని పార్టీల్లో ఉండే ప్రతి దళిత కుటుంబానికీ ఈ స్కీమ్ అందుతుంది. ఉమ్మడి జిల్లాలోని 1,200 కుటుంబాలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రయోజనం చేకూరుతుంది.
నమస్తే తెలంగాణ : దళిత బంధుతో రాబోయే మొదటి మార్పు?
మంత్రి జగదీశ్రెడ్డి : దళిత వర్గాలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు, వారిలోనూ వ్యాపార దృక్పథం పెరిగి ఆర్థిక స్వావలంబన రావాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకుగాను వారికి ఒక అవకాశం ఇవ్వాలని భావించారు. వారిని శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవడానికి వారికి ఆర్థిక సాయం అందాలని, తద్వారా సమాజంలో అసలైన మార్పు మొదలవుతుందని నమ్మారు. తాము ఎవరి కంటే కూడా తక్కువ కాదన్న భావనను పారదోలడం ఆర్థిక అసమానతలు తొలగించడం ద్వారానే సాధ్యమని దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. అనాదిగా దళితులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతూ వచ్చారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో దళిత బంధు ద్వారా జిల్లాల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదుగనున్నారు. ఒక మనిషి తన ఒక్కడి శ్రమపై ఆధారపడకుండా తనతోపాటు నలుగురితో ఉపాధి కల్పించడం ద్వారా ఎక్కువ లాభాలు పొందుతాడు. కష్టపడే మనస్తత్వం గల దళితుల్లోని శక్తిని వెలికితీస్తే అది రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటునిస్తుంది.