ఇంగ్లిష్ మీడియంలోనే 700 మంది
పాఠశాల అభివృద్ధిలో దాతలు, పూర్వ విద్యార్థులది కీలక పాత్ర
టెన్త్లో ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతూ ఫలితాలు
మన ఊరు- మన బడితో మారనున్న పాఠశాల రూపురేఖలు
ధీమా వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
మిర్యాలగూడ, జనవరి 25 మిర్యాలగూడ ప్రాంతంలో బకల్వాడీ స్కూల్ అంటే తెలియని వారుండరు. నాలుగు దశాబ్దాల ఈ పాఠశాల విద్యార్థులెందరినో తీర్చిదిద్దింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిరాదరణకు గురైనా.. దాతలు, పూర్వవిద్యార్థుల సహకారంతో తరగతి గదులు, అసెంబ్లీ హాల్, కళావేదిక, కనీస వసతులను సమకూర్చుకుని నాణ్యమైన బోధనను అందిస్తూ వచ్చింది. ఇప్పటికీ 800 మంది విద్యార్థులతో ఉమ్మడి జిల్లాలో ముందుంది. ప్రస్తుతం ఇక్కడ తెలుగు మీడియంలో 8, 9, 10 తరగతులు మాత్రమే నడుస్తుండగా 100 మంది విద్యార్ధులున్నారు. ఇంగ్లిష్ మీడియంలో 6 నుంచి 10 తరగతి వరకు 700 మంది చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల కృషికి తగ్గట్టు బకల్వాడీ విద్యార్థులు ఏటా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శ్రీకారం చుట్టిన మన ఊరు మన బడితో తమ పాఠశాలకు ఇక తిరుగే ఉండదని టీచర్లు, విద్యార్థులు ధీమాగా చెప్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల అభివృద్ధికి విరాళాల వెల్లువ..
పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది ముందుకు వచ్చి 11 తరగతి గదులు, అసెంబ్లీ హాల్, కళావేదిక నిర్మాణం చేశారు. 1997 సంవత్సరంలో లక్ష్మీనర్సమ్మాశ్యాంసుందర్, మేరెడ్డి శిరీషా విజయేందర్రెడ్డి, 1998లో ఇడుకుళ్ల వెంకటేశం, సంధ్యారాణి దంపతులు, ముక్కా భిక్షమయ్య ఒక్కో తరగతి గదిని నిర్మించారు. 2003లో లక్ష్మీ శ్యాంసుందర్రెడ్డి అసెంబ్లీ హాల్, 2004లో సమ్మిడి వీరారెడ్డి, వనజాత దంపతులు ఒక గది, 2004లో జొన్నలగడ్డ వెంకట్రెడ్డి, వాసుదేవరెడ్డి 6 తరగతి గదులు, టి.రాజేందర్రెడ్డి కళావేదిక నిర్మాణానికి చేయూత అందించారు. మంచుకొండ నర్సింహ మంచి నీటి ట్యాంకు, జొన్నలగడ్డ రత్నమాల రెండు బీరువాలు, టి.రామచందర్రావు మైక్సెట్, వంగాల నిరంజన్రెడ్డి మంచినీటి ఫిల్టర్, ఓవర్హెడ్ట్యాంకు మువ్వా రామారావు ఇన్వర్టర్, ఎంసీ.కోటిరెడ్డి స్పోర్ట్స్ కిట్, సోమ ఆంజనేయులు సైన్స్ పరికరాలు, చంద్రశేఖర్ అతడి మిత్ర బృందం ప్లేట్స్ విరాళంగా అందించారు.
‘సక్సెస్’ ఫుల్గా ఆంగ్ల మాధ్యమం..
బకల్వాడీ పాఠశాలను సక్సెస్ పాఠశాలగా ఎంపిక చేసి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించారు. దాంతో ఆంగ్ల మాధ్యమంలో బోధన విజయవంతంగా కొనసాగుతున్నది. విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంలో అడ్మిషన్ తీసుకుంటుండడంతో తెలుగు మీడియంలో 6, 7 తరగతులు మూతపడ్డాయి. 8,9,10 తరగతులు మాత్రమే నడుస్తుండగా 100మంది విద్యార్థులు ఉన్నారు. 6 నుంచి 10 తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో 700 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక ఈ పాఠశాలలో చేరుతున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియం విజయవంతంగా కొనసాగుతున్నది. ఏటా ఎస్ఎస్సీ పరీక్షల్లోనూ ఈ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో ముందుంటున్నారు.
‘మన ఊరు.. మనబడి’తో మారనున్న రూపురేఖలు
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దాతల సహకారంతో ఏటా అభివృద్ధి చెందుతున్న ఈ పాఠశాల.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన మన ఊరు.. మన బడి కార్యక్రమంతో మరింతగా మారనున్నది. కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్హాల్, మూత్రశాలల ఆధునీకరణ, లైబ్రరీలో అదనపు పుస్తకాలు, అన్ని తరగతి గదుల్లో గ్రీన్ చార్ట్ బోర్డులు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు.
పేద విద్యార్థులకు వరం లాంటిది..
నిరుపేదలకు సైతం ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలన్న బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యత పెరిగింది. ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులకు వరం లాంటింది. చాలా మంది ఆర్థిక భారంతో ప్రైవేలు పాఠశాలలకు వెళ్లలేక ఇంగ్లిష్ మీడియం అభ్యసించలేకపోతున్నారు. అక్కడక్కడా సక్సెస్ పాఠశాలలున్నా నిర్వహణ కొరవడడంతో లక్ష్యం నెరవేరడం లేదు. తిరిగి అన్ని పాఠశాలల్లోనూ తెలుగు, ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనందదాయకం.
-బండ వెంకట్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు