సమూహంగా కూడా యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు
జిల్లాలో ఎక్కడైనా యూనిట్ స్థాపించుకోవచ్చు..
లబ్ధిదారు ఆసక్తి, ఇష్టప్రకారం వ్యాపారం ప్రారంభించవచ్చు..
దళితుల తరతరాల తలరాతను మార్చే పథకం దళితబంధు
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమేసీఎం కేసీఆర్ లక్ష్యం
తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100మంది లబ్ధ్దిదారులు
ఎంపికైన వారికి శిక్షణ, నిపుణులతో తోడ్పాటు అందిస్తా..
దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు
సిద్దిపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి;దళితుల తరతరాల తలరాతను మార్చేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, దళితుల ఆర్థికాభివృద్ధితో పాటు వారిలో ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గించడానికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, మార్చిలో యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మంజూరు చేస్తామని, లబ్ధిదారు జిల్లాలో ఎక్కడైనా యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. నలుగురైదుగురు లబ్ధిదారులు కలిసి కూడా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.లబ్ధిదారులకు శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, వారు విజయవంతం అయ్యేవరకు అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. దళితబంధు ద్వారా ఆ కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అన్నారు.
దళితుల తరతరాల తలరాతను మార్చే పథకమే దళితబంధు. దళితుల ఆర్థికాభివృద్ధితో పాటు ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బృహత్తర పథకం. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారు. తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 100మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నది. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందని సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లోని లబ్ధిదారుల ఎంపిక సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా మంత్రి హరీశ్రావు నేతృత్వంలోనే జరుగుతుందన్నారు. మార్చిలో యూనిట్లు గ్రౌండింగ్ పూర్తిచేస్తామని తెలిపారు. ఒక నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నందున, ఆ నియోజకవర్గ కేంద్రం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా పరిధికే వస్తుందన్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్ హనుమంతరావు ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..
కలెక్టర్: సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నది. ఇటీవల సంగారెడ్డి జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్లానింగ్ సమావేశం త్వరలోనే నిర్వహిస్తాం. సమగ్ర సామాజిక అభివృద్ధికి దళితబంధు పథకం ఒక గ్రోత్ ఇంజిన్లా ఉపయోగపడుతుంది. దళితబంధు ద్వారా రూ.10 లక్షలు ఆర్థిక సాయాన్ని గ్రాంట్ రూపంలో అందిస్తాం. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ద్వారా లబ్ధిదారు ఉపాధిని ఎంచుకొని నికర ఆదాయం పొందడానికి వీలుగా ఈ మొత్తం పెట్టుబడి వనరుగా ఉపయోగపడుతుంది. దళిత కుటుంబాల నుంచి వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎదగాలన్నదే దళితబంధు పథకం ఉద్దేశం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 100మంది లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తాం.
ఎంపికైన లబ్ధిదారులు ఎలాంటి యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు..?
కలెక్టర్: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన లేదా తనకు అనువుగా ఉన్న ఉపాధి, వర్తక, వ్యాపార మార్గాలను లబ్ధిదారుడు స్వయంగా ఎంపిక చేసుకోవచ్చు. లబ్ధిదారుల అభిరుచి, నైపుణ్యం, ఆసక్తి ప్రకారం యూనిట్ల ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుడికి ఇచ్చే రూ.10లక్షల ఆర్థ్ధిక మొత్తాన్ని పూర్తిగా ఉచితంగా గ్రాంట్ రూపంలోనే అందించడంతో పాటు బ్యాంకు లింకేజీలు, రుణభారం ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం ద్వారా లబ్ధ్దిదారుడు తమకు అనువైన యూనిట్ను ఎంచుకోవచ్చును.
ఎంపికైన లబ్ధ్దిదారులకు శిక్షణ ఇస్తారా…?
కలెక్టర్: ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. పథకం గ్రౌండింగ్ పూర్తిచేసి విజయవంతమయ్యే వరకు జిల్లా యంత్రాంగం వెంబడి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఏదో కొనుక్కున్నామా అని కాకుండా, ఆ కుటుంబాల ఆర్థిక జీవన పరిస్థితులు మెరుగుపడేలా వినియోగించుకోవాలి. ఒక్కో సెక్టారుకు ఒక్కో నిష్ణాతులైన జిల్లాస్థాయి అధికారులు లబ్ధ్దిదారుల వెన్నంటి ఉండి వారికి అవగాహన కల్పిస్తారు. పథకం సక్సెస్ అయ్యే వరకు వారివెంట ఉంటారు. ఉదాహరణకు వ్యవసాయానికి అనుబంధమైన యూనిట్ ఏర్పాటు చేసుకుంటే సంబంధిత అధికారి ఉంటారు. పరిశ్రమలకు సంబంధించినది ఐతే పరిశ్రమల అధికారి సహాయ పడతారు. ఒకవేళ ఏదైనా లబ్ధిదారు కుటుంబం తమంతట తాము ఉపాధిని ఎంచుకోలేకపోతే వారికి ప్రభుత్వమే తగిన మార్గదర్శనం చేస్తుంది. అవసరమైన నైపుణ్యం పెంపొందించడానికి న్యాక్, నిమ్స్వే తదితర సంస్థల సహకారంతో శిక్షణను ప్రభుత్వం అందిస్తుంది.
లబ్ధ్దిదారుల ఎంపిక, గ్రౌండింగ్ వరకే అధికారుల బాధ్యత ఉంటుందా…? లేదా పర్యవేక్షిస్తారా..?
కలెక్టర్: లబ్ధ్దిదారులు ఉపాధిని ఎంచుకునే వరకే పరిమితం కాకుండా, వారు నిర్వహిస్తున్న ఉపాధి ప్రగతిని ఎప్పటికప్పడు సమీక్షిస్తూ, అవసరమైన సమయంలో తగిన సహకారాన్ని అందిస్తాం. వ్యాపారంలో తను సాధిస్తున్న పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తాం. ఏవైనా సమస్యలు తలెత్తినప్పడు అప్పటికప్పడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. దళితబంధు ద్వారా ఆ కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం.
దళిత రక్షణనిధి ఉద్దేశం ఏమిటి..?
కలెక్టర్: లబ్ధ్దిదారులకు రక్షణ కవచంగా నిలిచేది దళిత రక్షణనిధి. ఏదైనా జరుగరానిది జరిగి లబ్ధిదారుడి కుటుంబం తిరిగి పేదరికంలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల నుంచి రూ.10 వేలు సేకరించి, మరో రూ.10 వేలతో కలిపి రక్షణనిధిని ప్రభుత్వం చేస్తున్నది. ఈవిధంగా ఏర్పాటైన రక్షణ నిధి నిర్వహణ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధ్దిదారుల కుటుంబాలు నిర్వహిస్తాయి. స్వయం సహకార బృందాల మాదిరిగా వారు పరస్పరం సహకరించుకునే విధంగా ప్రభుత్వం ఈ రక్షణ వ్యవస్థను రూపొందించింది. ఆపద కాలంలో అవసరమైన సహకారాన్ని అందించి, లబ్ధ్దిదారుడి కుటుంబాన్ని తిరిగి నిలబెడుతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా దళిత రక్షణనిధిని ఏర్పాటు చేస్తాం.
దళితబంధులో ఏమేమి యూనిట్లు ఉన్నాయి.?
కలెక్టర్: ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తాం. ఎరువుల దుకాణం, మందుల, బార్షాప్, మినీ డెయిరీ యూనిట్, టైలరింగ్, పవర్ టిల్లర్, పందిరి కూరగాయల సాగు, ఐరన్ గేట్స్, గ్రిల్స్, ట్రాక్టర్, మినీ ట్రాన్స్పోర్టు వాహనాలు, కోడిపిల్లల పెంపకం, వరినాటు యంత్రం, సిమెంట్ ఇటుకల తయారీ, రింగుల తయారీ, కాంక్రీట్ మిశ్రమ తయారీ యంత్రాలు, వ్యాపారం, ఆయిల్మిల్, పిండి, పసుపు, కారం, మిల్లుల దుకాణాలు, మినీ సూపర్ బజార్, రిటైల్ దుకాణాలు, హార్డ్వేర్, శానిటరీ దుకాణాలు, విద్యుత్ పరికరాల అమ్మకాలు, హోటల్ క్యాటరింగ్, టెంట్హౌస్, డెకరేషన్ తదితర పథకాలు లబ్ధ్దిదారుల ఇష్ట ప్రకారం ఎంపిక చేసుకోవచ్చు.