రూ.3 కోట్లతో మార్కెట్ నిర్మాణం వ్యాపారులు,వినియోగదారులకు సకల సౌకర్యాల కల్పన
ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం..
భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి
రామచంద్రాపురం, జనవరి25: బల్దియా పరిధిలోని మార్కెట్ యార్డ్లు, రైతుబజార్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. మార్కెట్లను అభివృద్ధి చేస్తూ వ్యాపారులకు, వినియోగదారులకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేందుకు అనువుగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. కూరగాయలు, పండ్లు, నాన్వెజ్ మార్కెట్లను ఒకేచోట ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు కావాల్సిన సరుకులు అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి. మార్కెట్లను ఈ విధంగా అభివృద్ధి చేయడంతో వినియోగదారులకు పది చోట్లకు తిరగకుండా సమయం, పెట్రోల్ ఆదా అవుతుంది. చాలాచోట్ల ప్రభుత్వం మోడల్ రైతు బజార్ల నిర్మాణం చేపడుతున్నది. ప్రస్తుతం భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో రూ.3 కోట్లతో మోడల్ రైతుబజార్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రైతుబజార్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకొని జీవించే చిరు వ్యాపారులకు ప్రయోజనం కలిగే విధంగా రైతుబజార్ నిర్మాణం చేపడుతున్నారు. ఆర్సీపురం గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు 2002లో విశాలమైన స్థలంలో రైతుబజార్ని నిర్మించారు. అప్పుడు రైతుబజార్ ఊరికి చివరలో ఉన్నదనే నెపంతో అక్కడకు వచ్చి వ్యాపారం చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రైతుబజార్ నిరుపయోగంగా మారింది. ఎల్ఐజీతో పాటు బీడీఎల్, మ్యాక్సొసైటీ కాలనీలు ఏర్పడ్డాయి. ఆర్సీపురంలో నివాసాలు పెరిగి జనాభా పెరిగింది. స్థానిక ప్రజల డిమాండ్ మేరకు కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి రైతుబజార్ అభివృద్ధి విషయమై మంత్రి హరీశ్రావు, ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మొదట రైతుబజార్కు మరమ్మతులు చేయాలని ఆలోచన చేసినప్పటికీ వ్యాపారులు, వినియోగదారుల సౌకర్యార్థం మంత్రి హరీశ్రావు సహకారంతో మోడల్ రైతుబజార్కు శ్రీకారం చుట్టారు.
పనులు స్పీడ్గా జరుగుతున్నాయి..
మోడల్ రైతుబజార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం రూ.3 కోట్లతో రైతుబజార్లో షెడ్ల నిర్మాణ పనులను చేపట్టాం. మిగతా సౌకర్యాల ఏర్పాటు కోసం మరో రూ.2 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించాం. చిరువ్యాపారులకు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒకేచోట కావాల్సిన అన్ని వస్తువులు రైతు బజార్లో లభించనున్నాయి. ఒక్కో షెడ్లో 41 దుకాణాలు ఉంటాయి. దాదాపుగా నాలుగు షెడ్లకు గాను 170 వరకు దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రైతుబజార్ ఏర్పాటుతో భారతీనగర్, ఆర్సీపురం డివిజన్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.