పెద్దపల్లి రూరల్, నవంబర్ 24: మహిళలు, బాలికల రక్షణ చర్యల విషయంలో సఖీ కేంద్రం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పెద్దపల్లి జోన్ డీసీపీ పులిగిళ్ల రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం దేవునిపల్లి జాతర సందర్భంగా బుధవారం సఖీ కేంద్రం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి చిన్నారులు, మహిళలు, బాలికల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జాతరలో తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా డీసీపీ మహిళా హెల్ప్లైన్ 181, సఖీ కేంద్రం సేవల అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ షీ టీంలను ఏర్పాటు చేసింద తెలిపారు. జాతర, రద్దీ ప్రదేశాలు, కళాశాలలు, పాఠశాల పరిసరాల్లో పోలీసుల నిఘా కొనసాగుతుందన్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 181కు కాల్ చేస్తే వెంటనే రక్షణ చర్యలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి సీఐలు ప్రదీప్కుమార్, అనిల్కుమార్, ఎస్ఐలు మహేందర్ యాదవ్, రాజేశ్, సఖీ కేంద్రం నిర్వాహకురాలు స్వప్న, సభ్యులు అనంత శ్రీనివాస్, అశ్రిత, వెంకటరమణ, నిరంజన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుడి రథోత్సవం
దేవునిపల్లిలో బుధవారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పెద్దపల్లి జోన్ డీసీపీ పులిగిల్ల రవీందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు తదితరులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో శంకరయ్య ఆధ్వర్యంలో అందుగులపల్లి, దేవునిపల్లి సర్పంచ్లు కారె శారద శ్రీనివాస్, రాయిశెట్టి కిషన్, పంచాయతీ కార్యదర్శులు మంగ, కిశోర్ భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో పెద్దపల్లి సీఐ ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో సబ్డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.