నాడు పుష్కరాలపై వివక్ష
తెలంగాణలో ఘాట్లు కూడా నిర్మించని సీమాంధ్ర ప్రభుత్వాలు
పుష్కరాలంటే రాజమండ్రే అన్నట్లు చూపిన గత పాలకులు
ఉద్యమనేతగా గొంతెత్తిన కేసీఆర్
ఇక్కడి ఆలయాలు, సంస్కృతిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం
2015లో తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని వ్యాఖ్యలు
అన్నట్లుగానే సీఎం హోదాలో ధర్మపురిలో పుష్కరాలకు అంకురార్పణ
జగిత్యాల, అక్టోబర్ 24 (నమస్తేతెలంగాణ) ; గోదావరి పుష్కరాలు అనగానే సమైక్య పాలకులకు రాజమండ్రినే గుర్తుకు వచ్చేది. తెలంగాణలోని బాసర, కందకుర్తి, ధర్మపురి, వెల్గటూర్, కాళేశ్వరం, భద్రాచలంలోనూ నది నిండుకుండలా ప్రవహిస్తున్నా పట్టించుకోలేదు. నిధులన్నీ అక్కడికి మళ్లించి మనకు మొండిచెయ్యి చూపారు. నిజానికి పవిత్ర పుష్కర స్నానాలు, అధ్యాత్మిక నిలయాలైన పుణ్యక్షేత్రాల వద్ద జరుగాలి. రాజమండ్రిలో గోదావరి ప్రవాహం ఉంది కానీ అక్కడ ఎలాంటి పుణ్యక్షేత్రం లేదు. నాసిక్లో పుట్టి మహారాష్ట్ర మీదుగా, తెలంగాణలో అడుగు పెట్టే గోదావరి తల్లి బాసరలో సరస్వతమ్మను పలుకరించి, ధర్మపురి క్షేత్రంలో నర్సన్నకు నమస్తే చెప్పి, కాళేశ్వరంలో ముక్కంటిని స్పర్శించి, భద్రాదిలో రామన్నను దర్శిస్తుంది. అలాంటి పుణ్యక్షేత్రాల వద్ద గోదావరి పుష్కరాలే లేవన్నట్లుగా సీమాంధ్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పుష్కరాల సమయంలో తెలంగాణలోని పవిత్ర క్షేత్రాల వద్ద కనీసం స్నానాలకు ఘాట్లు సైతం నిర్మించలేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నేను ధర్మపురిలో పుష్కర స్నానానికి వస్తున్నానన్న విషయం తెలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్నట్లు ప్రకటన చేశాడు. ఇక్కడ పవిత్ర స్నానం కోసం వస్తే ఆటంకం కలిగిస్తున్నారు. ధర్మపురి నర్సన్న సాక్షిగా చెబుతున్నా..2015 పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయి. ఇదే ధర్మపురి క్షేత్రంలో నర్సన్న పాదాల వద్దనే పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొంటాను.
పవిత్ర కార్యదీక్షకు ప్రకృతి శక్తులన్నీ ఒకటై విజయాన్ని చేకూర్చుతాయన్న ఆయన మాటలకు నిదర్శనంగా పుష్కర కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్, సీఎం హోదాలో 2015లో ధర్మపురి నర్సన్న చెంత పవిత్ర పుష్కరాలను ప్రారంభించారు. ఇది మహోన్నత సంఘటన. చరిత్రలోనే గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించి ఔరా అనిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
పన్నెండేండ్ల తర్వాత 2003లో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మూడేండ్లు అవుతున్నది. ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ గోదావరి పుష్కరాల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చారు. గోదావరి పుష్కరాలంటే, రాజమండ్రిలో జరిగేవే అన్నట్లుగా సీమాంధ్ర ప్రభుత్వాలు వ్యవహరించేవని, ఈ పుష్కరాల నిర్వహణలో వివక్షపై తొలిసారిగా గొంతెత్తారు. తెలంగాణ పవిత్ర క్షేత్రాల గుండా గోదావరి పారుతున్నా, సీమాంధ్ర పాలకులు బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదని, తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, ఆలయాలను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాల్లో పుణ్యస్నానాల కోసం సరైన వసతులు కల్పించలేదని మండిపడ్డారు. దీంతో అప్పటి పాలకులు మేలుకున్నారు. నాటి సీఎం చంద్రబాబునాయుడు ధర్మపురిలో గోదావరి స్నానం చేయనున్నట్లు ప్రకటించారు. ధర్మపురికి చేరుకున్న ఉద్యమనేత కేసీఆర్, వేదపండితులతో సమావేశమయ్యారు. ధర్మపురిలో శ్రీమఠం కోసం మూడున్నరెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందజేశారు. అలాగే ఐదున్నర లక్షల వరకు విరాళాలను సేకరించి శ్రీమఠానికి అప్పగించారు. ఈ క్రమంలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన ఉద్యమ సారథి కేసీఆర్కు అప్పటి జిల్లాకు చెందిన మంత్రులు అనేక ఇబ్బందులు కలిగించారు. చాలాచోట్ల పికెటింగులు ఏర్పాటు చేయించారు. సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సాకుతో టీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారు.
చంద్రబాబునాయుడు ధర్మపురిలో సాంప్రదాయాలకు విరుద్ధంగా గోదావరిలోకి వెళ్లి షర్ట్, పాయింట్పైనే సగం వరకు మా త్రమే మునిగి పుష్కరస్నానం ప్రారంభించడంపై రుత్వికుల నుంచి మొదలుకొని వైదికుల వరకు వి మర్శలు గుప్పించారు. చంద్రబాబు అసంపూర్తి స్నా నంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యమనాయకుడు కేసీఆర్ 2015లో జరిగే పుష్కరాలు తెలంగాణలోనే జరుగుతాయని, నర్సన్న ఆశీస్సులతో ఉత్తర దక్షిణ వాహినిగా ఉన్న ధర్మపురి క్షేత్రంలోనే పుష్కర స్నానం చేస్తానని ప్రకటించారు. ఏ క్షణాన ఆయన ఆ వ్యాఖ్యాలు చేశారో గాని తథాస్తు దేవతలు ఆయన మాటలను దీవించారు. 2015 గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నాటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ సీఎం హోదాలో గోదావరి పుష్కరస్నానాలకు అంకురార్పణ చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా వేలాది కోట్ల రూపాయలను గోదావరి పుష్కరాల కోసం కేటాయించారు. ధర్మపురి, వెల్గటూర్ పుణ్యక్షేత్రాల వద్ద పుష్కర స్నానాలకు కనీవిని ఎరగని రీతిలో సౌకర్యాలు కల్పించారు. చరిత్రలో గోదావరి పుష్కరాలు నిలిచిపోయాలే చేశారు. 2015 జూలై 13న ధర్మపురి పుణ్యక్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, శ్రీమఠంతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గోదావ రి పుష్కర స్నానం కోసం ధర్మపురికి తరలివచ్చిన అనేక మంది పీఠాధిపతులను కలిసి వారికి సాంప్రదాయబద్దంగా స్వా గతం పలికారు. రాత్రిపూట ధర్మపురిలో బస చేసిన సీఎం దంపతులు, జూలై 14వ తేదీన ఉదయం 6.31 గంటలకు గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించి, సమస్త విశ్వానికి మేలు జరగాలని, పవిత్ర పుష్కర స్నానం ప్రజలకు అంతులేని సుఖ సంతోషాలను, ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను ఇవ్వాలని అభిలషించారు.