భువనగిరిలో 100 ఫీట్ల రోడ్డు
ఫుట్పాత్, పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు
మోడల్ సిటీగా మారనున్న జిల్లాకేంద్రం
స్థలాలు కోల్పోయే వారికి నాలుగింతల టీడీఆర్
భువనగిరి అర్బన్, నవంబర్ 23 : భువనగిరి పట్టణాన్ని మోడల్ సిటీగా మార్చే పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతమున్న రోడ్డును ఇరువైపులా 50 ఫీట్ల వరకు వెడల్పు చేయనున్నారు. ఇందుకు రూ.15.18 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు.
ఇరువైపులా 50 ఫీట్లు
భువనగిరి రహదారి బంగ్లా నుంచి లక్ష్మీనర్సింహస్వామి డిగ్రీ కళాశాల వరకు రోడ్డు వెడల్పు చేయనున్నారు. ఈ పనులను నిలిపివేయించేందుకు కొందరు వ్యాపారులు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే మున్సిపాలిటీ గతంలోనే 50 ఫీట్ల మేరకు స్థలాన్ని రోడ్డు కోసం కేటాయించింది. కానీ వ్యాపారస్తులు తమ స్థలం నుంచి ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారడం, ట్రాఫిక్ పెరుగడంతో విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. దుకాణాలకు నిర్మించే మెట్లు, ర్యాంపులు కూడా 50 ఫీట్ల అవతలివైపు నుంచి చేపట్టాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
బాధితులకు పరిహారం
రోడ్డు విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువకు నాలుగురెట్లు టీడీఆర్ రూపంలో అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రిజిస్టర్ దస్తావేజులు ఉండి ఆ స్థలాన్ని రోడ్డు వెడల్పు కోసం ఇచ్చిన యజమానులకు ప్రభుత్వ టీడీఆర్ పత్రం అందిస్తున్నది.(అభివృద్ధి హక్కుల బదలాయింపు) దీని విలువలు ప్రభుత్వ మార్కెట్ రేట్లకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. టీడీఆర్ సర్టిఫికెట్ను ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఇతర ప్రాం తాల్లో ఇల్లు కట్టుకునేందుకు మున్సిపాలిటీ అనుమతి ఇతర విషయాల కోసం ఈ పత్రాన్ని వినియోగించుకోవచ్చు. దీనికి కాల పరిమితి అంటూ ఏమీ లేదు. దీనిని ఒక సారి మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
తీరనున్న ట్రాఫిక్ సమస్య
భువనగిరి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో నిత్యం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. యాదాద్రికి వెళ్లే భక్తులు కూడా ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తున్నారు. దీంతో వాహనాలు కూడా అధికమయ్యాయి. రోడ్డు పక్కనే వ్యాపార సంస్థలు ఉండడం, ఆయా దుకాణాలకు వచ్చే వారు తమ వాహనాలను షాపు ఎదుటే నిలుపుతుండడంతో రోడ్డు మరింత ఇరుకుగా మారింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. అందుకే ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు గతేడాడే అధికారులు రోడ్డుకిరువైపులా మార్కింగ్ చేశారు. ప్రస్తుతం పనులు ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.