పెద్దపల్లి, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్/జగిత్యాల విద్యానగర్: కొవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 3 వరకు పరీక్షలు జరుగనుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 20,303 మంది పరీక్షలు రాయనుండగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నది. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించనుండగా నిమిషం నిబంధన అమలు కానున్నది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కరోనా నేపథ్యంలో ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. వారికి ఈ నెల 25 నుంచి నవంబర్ 3వరకు ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహించాలని ఇంటర్బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కొవిడ్ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థి మాస్కులు ధరించి హాజరుకావాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్తోపాటుగా శానిటైజర్ను, మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగనుండగా నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఐఈవో సూచిస్తున్నారు. విద్యార్థుల మధ్య కనీసం 5ఫీట్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకొని బెంచీకి ఒకరు విద్యార్థుల చొప్పున కూర్చోబెట్టనున్నారు. కొవిడ్ సోకినా, లక్షణాలున్న విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్ గదులలో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సదుపాయం, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు, మాల్ ప్రాక్టీస్ తదితర వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేయనున్నారు.
నిఘా పర్యవేక్షణలో పరీక్షలు….
అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. పరీక్ష రోజు ప్రశ్నాపత్రాలను సీసీ కెమెరాల ముందే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత పరీక్ష జరిగే రోజు ఆయా కేంద్రాల సీఎస్, డీవోలు ఉదయం 8 గంటలకే పోలీస్ స్టేషన్ చేరుకోవాలి. సంబంధిత కస్టోడియన్లు ఆ యా సెట్ ప్రశ్నాపత్రాన్ని ఉదయం 8.30 గంటల తర్వాత స్టేషన్ నుంచి కేంద్రాలకు పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను తరలించనున్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు సెల్ఫోన్ చీఫ్ సూపరింటెండెంట్కు అప్పగించా లి. పరీక్ష ముగిసిన అనంతరం తీసుకోవాల్సి ఉంటుంది.
సిరిసిల్ల జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 4,498 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు. అదే విధంగా కస్టోడియన్స్, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షల రోజుల్లో అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనున్నది.
జగిత్యాల జిల్లాలో..
జిల్లాలో 15ప్రభుత్వ, 16ప్రైవేట్ కళాశాలల్లో కలిపి మొత్తం 9,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో జనరల్ విభాగంలో 7936మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 1323మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 15ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 16ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, రెండు మోడల్ స్కూల్స్, నాలుగు జిల్లా పరిషత్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా జగిత్యాల జిల్లాలో 37పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణకు 36కేంద్రాలను కేటాయించారు. జిల్లాలోని 15ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 1ఎస్టీ సంక్షేమ గురుకుల కళాశాల, 7మోడల్ స్కూళ్లు, 5 సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, 4 కేజీబీవీలలో 6,545 మంది ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. జిల్లాలోని 14మండలాల్లో గల 15 ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలతో పాటుగా ధర్మారం మోడల్ స్కూల్, మంథని సాంఘిక సంక్షేమ, ఎన్టీపీసీ మైనార్టీ గురుకుల పాఠశాల, 7జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, 11ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. పరీక్షల నిర్వహణ కోసం 36మంది పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, 36మంది డిపార్ట్మెంటల్ అధికారులు, దాదాపు 540మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు.
మాస్కాపీయింగ్కు తావు లేకుండా చర్యలు..
పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్కాడ్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ(డెక్) స్కాడ్, 2సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్న కారణంగా నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించే అవకాశం లేదు. 8.30గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా విద్యార్థులు ప్లాన్ చేసుకోవాలి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నాం. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాల నిర్వహకులందరికీ ఇప్పటికే సమాచారమిచ్చాం.