ఈ నెల 25 నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలు
హాజరుకానున్న 6,062 మంది విద్యార్థులు
జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు
నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
స్టూడెంట్స్ సౌకర్యార్ధం ఆర్టీసీ బస్సులు
కొవిడ్ నిబంధనలతో ఎగ్జామ్స్ నిర్వహణ
అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 23 : కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు లేకుండానే ఇంటర్నల్స్ ఆధారంగా పాస్ చేసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రమోట్ చేసిన పరీక్షల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లా అధికారులు, అధ్యాపకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదివే ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు మొత్తం 6,062 మందికి గాను 2,899 మంది బాలురు, 3,163 మంది బాలికలు ఉన్నారు. వీరికి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 28 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టర్ శశాంక సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు.
306 మంది ఇన్విజిలేటర్లు
పరీక్షలు రాసే 6,062 మంది విద్యార్థుల కోసం 28 పరీక్షా కేంద్రాలు, 306 మంది ఇన్విజిలేటర్లు, 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెండు సిట్టింగ్ స్కాడ్స్, మూడు ఫ్లైయింగ్ స్కాడ్స్, 28 మంది డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా నోడల్ అధికారి కార్యాలయంలో పరీక్షల విధివిధానాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనునారు. ఏజెన్సీ, దూర ప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు ఇబ్బందులు, సమస్యలు రాకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనున్నది. నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్థులను గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రతి విద్యార్థి మధ్య ఆరు ఫీట్ల దూరం
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థి, విద్యార్థికి మధ్య కనీసం ఆరు ఫీట్ల దూరం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి తరగతి గదికి కేవలం 20 మంది విద్యార్థులుండేలా, పరీక్ష కేంద్రాల్లో పల్స్ ఆక్సీమీటర్లు, థర్మల్ స్కీ నింగ్ పరికరాలను సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, వైద్యసిబ్బంది విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.