ధర్మారం, అక్టోబర్ 20:ఆ ఊరి రైతులు 20 ఏండ్ల కిందటే పంటమార్పునకు శ్రీకారం చుట్టారు. నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు అడుగులు వేశారు.. తక్కువ కాలం..స్వల్ప పెట్టుబడి అవసరమయ్యే కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించారు. బంజేరుపల్లికి చెందిన సుమారు 70 మంది రైతులు 100 ఎకరాల్లో లాభాలపంట పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
బంజేరుపల్లిలో వరి సాగుకు యోగ్యంకాని గుట్టబోరు భూములు ఉండడం, నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో రైతులు కొంతకాలం వరికి బదులు పత్తి, మిరప లాంటి వాణిజ్యపంటలు పండించారు. అయితే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, ఆశించినమేర దిగుబడులు రాకపోవడంతో కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేస్తున్నారు..వీటికి మార్కెట్లో డిమాండ్ ఉండడం, పంటకోత కాలంలో ప్రతిరోజూ ఎంతోకొంత సంపాదన ఉండడంతో 20 ఏండ్లుగా ఇదే బాటలో ముందుకెళ్తున్నారు.
హైబ్రిడ్ జామతో లాభాలు..
కల్లెం కరుణాకర్రెడ్డికి మూడెకరాల భూమి ఉన్నది. 30 గుంట ల్లో హైబ్రిడ్ జామను సాగు చేశాడు. గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఓ నర్సరీ నుంచి తైవాన్ పింక్, వైట్ హైబ్రిడ్ రకానికి చెందిన 900 మొక్కలను రూ.60 చొప్పున కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. రవాణా ఖర్చులతో కలుపుకొని ఒక్కో మొక్క ఖరీదు రూ.70 అయింది. మొత్తంగా రూ.54 వేలు ఖర్చు చేశాడు. గుంతల తవ్వకం, ఎరువులు, కూలీలకు రూ.35 వేలు తోట చుట్టూ ఇనుప కంచె వేసేందుకు రూ.లక్ష ఖర్చు చేశాడు. ఆరు ఫీట్ల ఎడంతో మొక్కలను నాటించాడు. హైబ్రిడ్ మొక్కలు కావడంతో తొలిసారి కాసిన కాయలను తొలగించాడు. ఎనిమిది నెలల తర్వాత పెద్ద సైజులో కాయలు చేతికి రాగా. ఇప్పటివరకు ఐదుసార్లు తెంపి విక్రయించాడు. ఇప్పటి వరకు రూ.15వేలు ఆదాయం వచ్చిందని కరుణాకర్ రెడ్డి చెప్పాడు. ఇకముందు పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవని, యేటా రూ.1.80 లక్షల ఆదాయం వస్తుందని పేర్కొంటున్నాడు. వరితో పోల్చితే రెట్టింపు లాభం ఉంటుందని చెబుతున్నాడు.
కూరగాయలకు కేరాఫ్..
ఇక్కడి రైతులు 20 ఏండ్లుగా తీరొక్క కూరగాయలు పండిస్తుండడంతో బంజేరుపల్లి కూరగాయలకు కేరాఫ్గా మారిపోయింది..తరి భూముల్లో పలువురు రైతులు వరి వేస్తున్నారు. మెట్ట స్థలాల్లో వరికి బదులు కూరగాయలు, పండ్లతోటలు పెంచుతున్నారు. ఎండకాలంలోనే మెట్ట భూములను దుక్కులు దున్ని సిద్ధం చేస్తారు. వానలు పడగానే అల్చింత, బీర, కాకర, గోరు చిక్కుడు, సొరకాయ కూరగాయ తోటలను సాగు చేస్తారు. తీగ జాతి కూరగాయల మొక్కలను కర్రలతో పాదులు తయారు చేసి వాటికి అంటుగడుతారు. 3 నెలల తర్వాత కూరగాయలు చేతికివస్తాయి. ఇక్కడ నుంచి కరీంనగర్, మంచిర్యాల మార్కెట్లకు తరలించి హోల్సేల్గా విక్రయిస్తారు. ధర్మారంలో ప్రతి మంగళవారం జరిగే వారసంతలో హోల్సేల్ వ్యాపారులకు అమ్ముతుంటారు. కాగా, తీగ జాతిలో మరొక జాతి కూరగాయ చిక్కుడు. బీర, అలిచింత పంటల సమయం ముగిసిపోగానే అవే పాదుల వద్ద చిక్కుడు మొక్కలు పెంచి వీటి తీగలను వాటికి పారే విధంగా చేస్తారు. ప్రస్తుతం చిక్కుడు పూత దశలో ఉన్నది. వారం పదిరోజుల్లో కాతకాసే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ప్రయోగాత్మకంగా బూడిద గుమ్మడి..
గ్రామానికి చెందిన యువరైతు గొల్లశెట్టి కంఠేశ్వర్ ప్రయోగాత్మకంగా బూడిద గుమ్మడి సాగు చేపట్టాడు. ఆయన ఇటీవలే మల్లాపూర్ శివారులో 3.15 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఇందులోని ఆరు గుంటల భూమిలో గుమ్మడి సాగు చేస్తున్నాడు. గత ఆగస్టులో మార్కెట్లో రూ.900 వెచ్చించి గుమ్మడి విత్తనాలు కొనుగోలు చేసి నాటాడు. కూలీలకు రూ.1,600 ఖర్చు చేశాడు. ఇటీవల వర్షాలు బాగా కురువడంతో పంట బాగా పండింది. చిన్న, పెద్ద సైజులో బూడిద గుమ్మడి కాయలు కాసి తెంపడానికి సిద్ధంగా ఉన్నాయి. క్వింటాల్కు 10వేలకు పైగా ఆదాయం వస్తుందని కంఠేశ్వర్ చెబుతున్నాడు.