నిర్మల్ అర్బన్, అక్టోబర్ 17 : నిర్మల్ జిల్లాలో అక్రమ వెంచర్లకు అడ్డూఅదుపు లేకుండాపోతున్నది. నాలాలు, చెరువులు ఆక్రమించి ప్లాట్లు చేస్తుండగా, వర్షాలకు వరద పోటెత్తి ఇండ్లు, రోడ్లపైకి చేరుతున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన వాటిపై కొరడా ఝలిపించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఇప్పటికే నిర్మల్ మున్సిపాలిటీలో 22, భైంసా మున్సిపాలిటీలో 18, తదితర చోట్ల 10 వరకు వెంచర్లు ఉన్నట్లు గుర్తించగా, ఇటు రియల్టర్లు, అటు కొనుగోలు చేసిన వారిలో టెన్షన్ మొదలైంది.
నిర్మల్ జిల్లాలో అనుమతులు, కనీ స నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను తొలగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. చెరువుల పరిధిలో, నా ళాల పక్కన నిబంధనలకు నీళ్లొదిలారు. వెంచర్లలో కనీస సదుపాయా లు కల్పించకుండా, పార్కుకు, ఇతర అవసరాలకు జాగ వదలకుండా చేసిన ప్లాట్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించనున్నారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అనేక కాలనీల్లోకి వరద వచ్చింది. మరికొన్ని కాలనీలు స్వల్పంగా నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఇలాంటి కాలనీలతో పాటు ఇటీవల ఇబ్రహీం చెరువు పూర్తిగా నిండింది. నీరు వెళ్లేందుకు కనీసం నాలాలు లేవు. దీనికితోడు దానిపక్కనే వెంచర్లు చేయడంతో ఆ నీరంతా ఎటూ వెళ్లక.. ఖాళీ ప్రదేశాల్లోకి వస్తున్నది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జి ల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాలతోపాటు చుట్టుపక్కల మండల కేంద్రాల్లో వెంచర్లు చేసిన రియల్టర్లు, అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో దాదాపు 50 వెంచర్లు నిబంధనలు పాటించకుండా ఉన్నట్లు సమా చారం.
నిబంధనలు పాటించని వెంచర్లపై రంగం సిద్ధం..
నిబంధనల ప్రకారం చేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇంటి అనుమతులు సులువుగా లభిస్తాయి. సాధారణంగా వెంచర్లు చేసే రియల్టర్లు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం చేస్తే అందరికీ ప్రయోజనాలుంటాయి. వీటిని ప్రజలు కొనుగోలు చేస్తే వారికి సకాలంలో ఇంటి అనుమతులతో పాటు, ఇంటి నిర్మాణానికి రుణాలు త్వరగా అందుతాయి. కానీ, రియల్టర్లు ఇలాంటి నిబంధనలేవీ పాటించకుండా ధనార్జనే ధ్యేయంగా అమాయక ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. వెంచర్లలో చిన్న చిన్న రోడ్లు వేసి, లేఅవుట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వెంచర్ల్లలో పార్కులకు కేటాయించే స్థలాల్లోనూ ప్లాట్లు చేసి విక్రయాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గతంలో చేసిన వెంచర్లు, ప్రస్తుతం చేపడుతున్న వెంచర్లపై కొరడా ఝులిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.
జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీ ఏర్పాటు..
జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాల్టీలతోపాటు వివిధ మండలాల్లో అనుమతులు లేకుండా వెలిసిన వెంచర్లను తొలగించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈటీంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కమిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు. మొత్తం 7 మంది జిల్లా స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరు పట్టణ ప్రాంతాలతో పాటు జిల్లాలో పర్యటించి అనుమతులు లేని, నిబంధనలు పాటించని వెంచర్లపై చర్యలు తీసుకోనున్నారు.
రంగంలోకి అధికారులు..
జిల్లాలో అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. గతంలో కలెక్టర్ నేతృత్వంలో భైంసా, నిర్మల్ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్లను అధికారులు తొలగించారు. తాజాగా జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు కాగా.. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా లో దాదాపు 50 వరకు నిబంధనలు పాటించని వెంచర్లున్నట్లు గుర్తించారు. అందులో నిర్మల్ మున్సిపాల్టీలో 22, భైంసా మున్సిపాల్టీలో 18 ఉండగా.. మిగతా 10 ఇతర మండలాల్లో ఉన్నాయి.
నిబంధనల ప్రకారమే వెంచర్లు చేయాలి..
నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనలు పాటించే వెంచర్లను ఏర్పాటు చేయాలి. లే అవుట్ ద్వారా 60-65 శాతం ప్లాటింగ్ చేసి 40 శాతం మౌలిక సదుపాయాల కల్పనకు వదిలిపెట్టాలి. మున్సిపల్ నియమనిబంధనల ప్రకారం అనుమతులున్న లేఅవుట్లోనే ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేయాలి. ప్లాట్ కొనుగోలు చేసే ముందు లే అవుట్ ఆమోదం ఉందోలేదో చూసుకోవాలి. ఆమోదం పొందిన లేఅవుట్లో ప్లాట్ల సంఖ్య, మౌలిక సదుపాయాల కల్పనకు స్థలం సరిగ్గా ఉందోలేదో చూసుకొని కొనాలి. అనుమతులు లేని వాటిలో ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇంటి అనుమతులు ఇవ్వబడవు.