నీలగిరి, డిసెంబర్ 14 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పన్నిన వ్యూహం ఫలించిందని, తన ఓటమికి ప్రధాన కారణం ఆయనేనని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేశ్ ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. తనకు ఓటు వేయ వద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వయంగా ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకు ఫోన్ చేసి చెప్పారన్నారు. నల్లగొండలో ఎమ్మెల్యేగా ఓడిపోయి భువనగిరికి వస్తే ఆయన విజయానికి అహర్నిశలు కష్టపడి పనిచేశామని గుర్తు చేశారు. ఆయన పోటీ చేసినప్పుడు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు గుర్తుకువస్తారని, మాకు గెలిచే అవకాశం ఉన్నప్పుడు పార్టీలు పక్కన బెట్టి జెండాలను మాత్రమే మిగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ఓట్లు ఉన్న ఖమ్మం, మెదక్ స్థానాల్లో పోటీకి పెట్టి, ఇద్దరు ఎంపీలు, ఎక్కువ ఓట్లు ఉన్న నల్లగొండలో మాత్రం వదిలేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆ ఇద్దరు ఎంపీల వ్యవహారతీరు పార్టీకి తీరని నష్టం మిగిల్చిందన్నారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు స్వతంత్రంగా పోటీ చేస్తే వారిని సమన్వయం చేసే నాయకత్వం లేకుండా పోయిందని విమర్శించారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకత్వానికి పదవులు కావాలి తప్ప మరొకరికి అవకాశం ఇచ్చే స్థితిలో లేదని మండిపడ్డారు. పార్టీ కంటే వారికి కులం బలమే ముఖ్యమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాం గ్రెస్ నాయకత్వం ఎవరికోసం పని చేసిందో అర్థం చేసుకోవాలని, వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదని, వ్యవహార శైలి సరికాదని అన్నారు. తనకుపై నమ్మకంతో ఓట్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.