రీజినల్ రింగ్రోడ్డుతో మారనున్న రూపురేఖలు భూసేకరణకు సూచనప్రాయంగా మార్గదర్శకాలు!
తొలి దశకు సిద్ధమవుతున్న అధికారులు
చౌటుప్పల్, డిసెంబర్ 14 ;చౌటుప్పల్.. ఇప్పుడీ పేరు రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్.ఆర్.ఆర్) చౌటుప్పల్ మీదుగా పోతుండడంతో అందరూ చౌటుప్పల్ నామస్మరణ చేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు గూగుల్ మ్యాప్లో చౌటుప్పల్కు చోటు దక్కడమే దీనికి కారణం. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతున్న చౌటుప్పల్కు ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న రీజినల్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి కొత్త పుంతలు
తొక్కనుంది.
181 కిలో మీటర్ల రీజినల్ రింగ్రోడ్డు..
చౌటుప్పల్ మీదుగా సంగారెడ్డి వరకు రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది. చౌటుప్పల్ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి, ఆమనగల్ మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం 181 కిలో మీటర్ల మేర రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతేకాకుండా భూసేకరణకు సూచన ప్రాయంగా మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. మార్గదర్శకాలు అందిన వెంటనే ఈ ప్రాంతాల్లో తొలిదశ భూసేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల రైతులను సైతం ఇందుకు సన్నద్ధం చేస్తున్నారు. రహదారి మార్గం వెళ్లే ప్రాంతాల్లోని ఒక్కో జిల్లాను ఒక్కో యూనిట్గా తీసుకోవాలా ..లేక నిర్ధ్దారిత కిలోమీటర్లకు ఒక యూనిట్ను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తొలి దశ భూసేకరణను మెరుపు వేగంతో చేపట్టాలని రెవెన్యూ అధికారులు సన్నద్ధ్దమవుతున్నారు. వచ్చే 30 నుంచి 35 ఏండ్ల వరకు ట్రాఫిక్ అంచనా మేరకు ఆర్.ఆర్.ఆర్ను ఏర్పాటు చేయనున్నారు.
అభివృద్ధిలో పరుగులు..
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చౌటుప్పల్ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ చిహ్నమైన పైలాన్, మండలంలోని దండు మల్కాపురంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్తో చౌటుప్పల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇక రీజినల్ రింగ్ రోడ్డు కూడా చౌటుప్పల్ మీదుగా పోతుండడంతో ఈ ప్రాంతానికి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే చౌటుప్పల్ మండలంలో ఏ మారుమూల గ్రామంలోనైనా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే ఎకరం రూ.50 లక్షల నుంచి కోటి పలుకుతుంది. ఇక రీజినల్ రింగ్ ఏర్పాటైతే ఈ ధరలు 3 నుంచి 5 రెట్లకు పెరుగుతుందని అంచనా. ఇక రీజినల్ రోడ్డు పక్కనున్న భూముల ధరలు అంచనా వేయడం కూడా కష్టమేనని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటైన 20 కి.మీ మేర భూములతో పాటు ఓపెన్ ప్లాట్ల ధరలు సైతం 5, 6 రెట్లు అధికంగా పలుకుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ అనేక కమర్షియల్ షాపులు , కాంప్లెక్సులు, మల్టీ స్టోర్ బిల్డింగ్, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద విల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ భూములున్న రైతులు కోటీశ్వర్లుగా, ప్లాట్లున్న యజమానులు లక్షాధికారులుగా మారనున్నారు. ఏది ఏమైనా రీజినల్ రింగ్ ఏర్పాటుతో చౌటుప్పల్ తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఉత్తర్వులు అందిన వెంటనే భూసేకరణ
ఇప్పటికే ప్రభుత్వం రీజినల్ రింగ్రోడ్డుకు ఆమోద ముద్ర వేసింది. ఇక భూసేకరణ చేపట్టడమే మిగిలిపోయింది. మొదటి దశ భూసేకరణ చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే భూసేకరణ ప్రక్రియ మొదలు పెడుతాం.