ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
జీహెచ్ఎంసీ, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
ఎల్బీనగర్, జనవరి 14: జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ధప్రతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే, ఎంఆర్డసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం జలమండలి, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ వింగ్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బండ్లగూడ చెరువు ప్రాంతంలో జీహెచ్ఎంసీ 70 మీటర్లు చిన్న డ్రైయిన్ లైన్ వేశారని, ఇక్కడ సమగ్ర నాలా డెవలప్మెంట్ కార్యక్రమం కింద పనులు చేస్తున్నారని, ఈ పనులను ఇరు విభాగాలు సమన్వయంతో చేపడితే బాగుంటుందని అన్నారు. డ్రైయిన్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఎత్తు, పల్లాలను సరి చూసుకుని పనులు చేపట్టాలన్నారు. అక్కడ ఉన్న ఓ ప్రైవేటు స్థలం గుండా పైపులైన్ వేస్తున్నామని, దానికి గాను సదరు వ్యక్తికి నష్టపరిహారం కూడా ఇప్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రా గార్డెన్స్ నుంచి మెగా ఫంక్షన్హాల్ మీదుగా సరూర్నగర్ చెరువు వరకు, సరూర్నగర్ చెరువు నుంచి కోదండరాంనగర్ మీదుగా చైతన్యపురి మూసీ నాలా బ్రిడ్జ్ వరకు సరూర్నగర్ ఇందిరా ప్రియదర్శినీ పార్కు నుంచి సరూర్నగర్ చౌడీ, జోనల్ కమిషనర్ కార్యాలయం మీదుగా చైతన్యపురి బ్రిడ్జ్ వరకు వరదనీటి కాలువ నిర్మాణ పనులు కూడా అతిత్వరలో మొదలుపెట్టాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని వరదనీటి కాలువ పనులను పూర్తి చేసి రాబోయే వర్షాకాలంలో ప్రజలను వరదనీటి ముంపు నుండి విముక్తులను చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ ఉప కమిషనర్ మారుతీ దివాకర్, ఇరిగేషన్ ఎస్ఈ మురళీకృష్ణ, డీఈ పవన్, ఈఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు.